ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు.. నితీష్ సర్కార్ బలపరీక్ష వేళ బిహార్లో నాటకీయ పరిణామాలు
బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే నితీష్ ప్రభుత్వం.. బలపరీక్షకు కొన్ని గంటలకు ముందు బిహార్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు. బిహార్లో ఇటీవల జేడీయూ, ఆర్జేడీ, ఇతర పార్టీలతో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే నితీష్ ప్రభుత్వం.. బలపరీక్షకు కొన్ని గంటలకు ముందు బిహార్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. రైల్వో ఉద్యోగాల కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు, ఎమ్మెల్సీ సునీల్ సింగ్కు సంబంధించిన ప్రదేశాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అష్ఫాక్ కరీం ఇంటిపై కూడా దాడులు జరుగుతున్నట్టుగా రిపోర్ట్లు వస్తున్నాయి.
ఈ దాడులపై ఆర్జేడీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భయంతో ఎమ్మెల్యేలు వారికి అనుకూలంగా వస్తారని భావించి ఇలా చేస్తున్నారని సునీల్ సింగ్ ఆరోపించారు.
Also Read: బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వానికి నేడు బలపరీక్ష..
లాలూ ప్రసాద్ యాదవ్.. కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు భారతీయ రైల్వేలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఆయన భోలా యాదవ్ను నెల రోజుల క్రితం సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. భోలా యాదవ్కు చెందిన పాట్నా, దర్భంగాలోని నాలుగు ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు నిర్వహించి, అతని పూర్వీకుల ఇంటి నుంచి నేరారోపణ పత్రాలు, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక, భోలా యాదవ్ 2005 నుంచి 2009 మధ్య యూపీఏ ప్రభుత్వ సమయంలో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్కు ఓఎస్డీ అధికారిగా ఉన్నారు.
ఇక, ఈ కేసులో ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్లలో ఉద్యోగాలు పొందిన 12 మందితో పాటు లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లపై సీబీఐ మే 18న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.