సోనియా, ప్రియాంక, అసదుద్దీన్లపై కేసు నమోదు: జనవరి 24న విచారణ
ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై యూపీలో కేసు నమోదైంది
ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై యూపీలో కేసు నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రదీప్ గుప్తా అనే న్యాయవాది వీరి ముగ్గురితో పాటు పాత్రికేయుడు రవీష్ కుమార్లపై అలీగఢ్లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
Also Read:నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న ముగ్గురు నిందితులు
దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించి జనవరి 24కు వాయిదా వేసింది. సోమవారం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద సత్యాగ్రహం చేపట్టింది.
కాగా.. ఈ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరిగిన ఆందోళనల్లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్, ప్రియాంకలను మీరట్లో అడ్డుకున్న సంగతి తెలిసిందే.
మీరట్లో జరిగిన ఆందోళనల్లో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు వారిని అదుపుచేసేందుకు భాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read:మంగళూరు హింస పథకం ప్రకారం చేసిందే...సీసీటీవీల్లో విస్తుపోయే విషయాలు
మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధులు మండి హౌస్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టడంతో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.