వరుణ్ ఐడియాలజీని అంగీకరించలేను.. అతడిని కౌగిలించుకోగలను.. కానీ: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్న ఊహాగానాల్లో ఎటువంటి వాస్తవం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్న ఊహాగానాల్లో ఎటువంటి వాస్తవం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలు సరిపోలనందున ఇది సమస్యాత్మకం అని అన్నారు. వరుణ్ గాంధీ ఏదో ఒక సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలాన్ని అంగీకరించారని.. దానిని తాను ఎప్పటికీ అంగీకరించలేనని గాంధీ విలేకరులతో అన్నారు. పంజాబ్లో భారత్ జోడో యాత్ర సాగిస్తున్న రాహుల్ గాంధీ హోషియార్పూర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరుణ్ గాంధీ బిజెపిలో ఉన్నారు. అతను ఇక్కడ నడిస్తే అది అతనికి సమస్య కావచ్చు’’ అని అన్నారు.
‘‘నేను ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్లలేను.. దానికి ముందు మీరు నా తల నరికివేయాలి. నా కుటుంబానికి ఒక భావజాలం, ఆలోచనా విధానం ఉంది. అతను (వరుణ్ గాంధీ) ఏదో ఒక సమయంలో, బహుశా ఈ రోజు కూడా ఆ భావజాలాన్ని అంగీకరించి.. దానిని తన సొంతం చేసుకున్నాడు. నేను ఆ విషయాన్ని ఎప్పటికీ అంగీకరించలేను. నేను ఖచ్చితంగా అతనిని కలవగలను, కౌగిలించుకోగలను.. కానీ ఆ భావజాలాన్ని అంగీకరించలేను. అసాధ్యం” అని రాహుల్ అన్నారు. ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక పోరు నడుస్తోందని ఆయన చెప్పారు. అధికార బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనిని వరుణ్ గాంధీ ప్రశంసించిన సంఘటనను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
Also Read: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?
ఇక, మంగళవారం భారత్ జోడో యాత్రలో భద్రతా ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన వార్తలను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. భద్రతా తనిఖీ తర్వాత ఒక వ్యక్తి అక్కడ ఉన్నారని.. అయితే అతిగా ఉద్వేగానికి గురై కౌగిలించుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.