India Pak border: పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన చైనా తయారీ డ్రోన్‌ను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) కూల్చివేసింది. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్ సెక్టార్‌లోని కలాన్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.  

India Pak border: పంజాబ్‌లోని అమృత్‌సర్ సెక్టార్‌లో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్‌ను కూల్చివేసినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) వెల్లడించింది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్ సెక్టార్‌లోని ధనో కలాన్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన BSF సిబ్బంది ఎగిరే వస్తువు శబ్దం విని, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ప్రకారం దానిని కాల్చి వేశారు. వెంటనే పోలీసులకు, ఇతర భద్రతా సంస్థలకు సమాచారం అందించారు.

ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అన్వేషించ‌గా.. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ధనో కలాన్ గ్రామం సమీపంలో సెర్చ్ టీమ్ బ్లాక్ కలర్ 'మేడ్ ఇన్ చైనా' క్వాడ్‌కాప్టర్ (డ్రోన్), మోడల్ DJI మ్యాట్రిస్-300ని స్వాధీనం చేసుకుంది. దానిని కాల్చివేసినప్పుడు.. అందులో ఏమైనా.. పేలుడు ప‌దార్థాలు ఉన్నాయా? లేవా? అనేది నిర్ధారించుకున్న త‌రువాత డ్రోన్ ను స్వాధీనం చేసుకున్న‌ట్టు BSF అధికారులు తెలిపారు.

భారత్‌కు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తులు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. పంజాబ్ సరిహద్దులో హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు డ్రోన్‌ను కూల్చివేసిన తర్వాత ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ BSF అధికారులు తెలిపారు.

మరోవైపు శుక్రవారం పాకిస్థాన్‌కు చెందిన 55 ఏండ్ల వ్యక్తి ఎలాంటి అనుమ‌తి లేకుండా.. సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. గమనించిన భద్రతా సిబ్బంది అతడ్ని అరెస్ట్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది. తుర్కుండి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్థానీ వ్యక్తిని అరెస్ట్‌ చేసి మంజకోట్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అతడి వద్ద ఒక గొడ్డలి, పా‌క్‌ కరెన్సీ ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.