డాక్టర్ కఫీల్ సోదరుడు జమీల్పై హత్యాయత్నం, ఏమైందంటే?
యూపీలో కాల్పుల కలకలం
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ కు చెందిన డాక్టర్ కఫీల్ ఖాన్ సోదరుడు వ్యాపారవేత్త కసీఫ్ జమీల్ ను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గోరఖ్పూర్ ఆసుపత్రిలో చిన్నారుల మారణహోమానికి డాక్టర్ కఫీల్ ఖాన్ కారణమని ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవలే బెయిల్పై విడుదలై వచ్చారు. అయితే తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొనేందుకుగాను ఆయన తన ప్రయత్నాలను ప్రారంభించారు.
కఫీల్ సోదరుడు కసీఫ్ జమీల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రిపూట కొందరు గుర్తు తెలియని దుండగులు వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్ కు తరలించి శస్త్రచికిత్స నిర్వహించి మెడలో బుల్లెట్ ను తొలగించారని డాక్టర్ కఫీల్ తెలిపారు. కఫీల్ ను 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెప్పారని డాక్టర్ కఫీల్ చెప్పారు. అయితే ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ స్పందించారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం డబ్బులు చెల్లించకుండా యోగి ప్రభుత్వం చిన్నారులను బలి తీసుకొందన్నారు. స్వంత డబ్బులతో చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్ కఫీల్ ఖాన్ యోగి ప్రభుత్వం అరెస్ట్ చేయించిందన్నారు. అంతేకాదు ఇవాళ ఆయన సోదరుడిపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ రకమైన అచ్చెదిన్ అందిస్తున్న మోడీకి ధన్యవాదాలు అంటూ మెవానీ ట్వీట్ చేశారు.