జోరుగా సాగుతున్న కర్ణాటక ప్రచారం.. అన్ని రికార్డులను బ్రేక్ చేస్తామన్న ప్రధాని..
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అగ్ర నేతలు రంగంలో దించాయి. తాజాగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజారిటీ సాధిస్తుందని జోస్యం చెప్పారు
![BJP will register record majority, PM Modi tells party workers KRJ BJP will register record majority, PM Modi tells party workers KRJ](https://static-ai.asianetnews.com/images/01gz0fvbpn4d2wh3jfv7qe93sv/pm-modi_363x203xt.jpg)
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అగ్ర నేతలు రంగంలో దించాయి. వారు ఢిల్లీ నుంచి గల్లీల దాకా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 50 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బిజెపి , ఇతర పార్టీల మధ్య చాలా వ్యత్యాసముందనీ, అధికారం చేజిక్కించుకోవడమే ప్రత్యర్థుల ఎజెండా అని అన్నారు. రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేయడం, పేదరికం నుంచి విముక్తి కల్పించడం, యువత సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం బీజేపీ ఎజెండా అని అన్నారు.
రానున్న 25 ఏళ్లలో కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీజేపీ యువజన బృందాన్ని నిర్మిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజారిటీ సాధిస్తుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. కర్ణాటక రాష్ట్ర ప్రజల మన్ననలు పొందేందుకు తాను ఒకటిరెండు రోజుల్లో కర్ణాటకలో పర్యటిస్తాననీ, రాష్ట్రంలో ప్రచారం చేసిన బీజేపీ నేతలు ప్రజల అభిమానాన్ని పొందుతున్నారని అన్నారు. కర్ణాటక ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది అనడానికి ఇదే నిదర్శమని అన్నారు.
ప్రజాస్వామ్య వేడుకలు
కర్ణాటకలో ప్రజాస్వామ్య పండుగ జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ ఎప్పుడూ ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకుంటుందనీ, కర్ణాటక ప్రజాస్వామ్య సూత్రాన్ని వివరించిన బసవేశ్వరుడి భూమి అని, కర్ణాటక గొప్ప సంప్రదాయానికి ప్రతినిధి అని అన్నారు. దేశభక్తితో నిండిన భాజపా కార్యకర్తగా అందరికి కంటే రెట్టింపు గర్వం ఉన్నానని అన్నారు. ప్రజల మనసు గెలుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. బూత్తో అనుబంధం ఉంటేనే అక్కడి వారి హృదయాలను గెలుచుకోగలుగుతామని అన్నారు.
ప్రపంచంలోని చాలా దేశాలు కరోనాతో పోరాడడంలో మునిగిపోయాయని, అయితే భారత్ మాత్రం కరోనాపై విజయవంతంగా పోరాడిందని ప్రధాని అన్నారు. నేడు దేశంలో మౌలిక సదుపాయాలపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారనీ, అదే సమయంలో కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు లక్షల కోట్ల రూపాయలను పంపి వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడుతున్నమని అన్నారు.
గత 9 ఏళ్లలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న ప్రతి చోటా పేద సంక్షేమ పథకాలు శరవేగంగా ఊపందుకున్నాయనీ, భాజపా ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరైనా విధంగా అమలు కావడం లేదని అన్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ పథకాలను అస్సలు అమలు చేయడం లేదనీ అన్నారు. కొన్ని రాష్ట్రాలు పథకం పేరును మార్చాయనీ, భాజపాకు సేవ చేసే అవకాశం వస్తే అభివృద్ధి వేగం రెండింతలు పెరుగుతుందని సూచించారు.
నాటికి (2014కి ముందు) నేటికి దేశ అభివృద్ధిలో గణనీయమైన మార్పులు వచ్చాయనీ, 2014కు ముందు పథకాల్లో ఇంటి నిర్మాణానికి 300 రోజులు పట్టేదన్నారు. నేడు 100 రోజులలోపే ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఇంటి పరిమాణం 20 చదరపు మీటర్లు, ఇప్పుడు ఇంటి పరిమాణం 25 చదరపు మీటర్లు. గతంలో పథకంలో ఇంటికి రూ.70-75 వేలు సాయం అందించగా, నేడు ఈ సాయాన్ని రూ.లక్ష 30వేలకు పెంచామని తెలిపారు. ఇంతకు మించి .. ఇప్పుడు నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపుతున్నామనీ, ఎలాంటి మధ్యవర్తి లేరని అన్నారు.
60 ఏళ్లలో AIIMS సంఖ్య 1 నుంచి 7కి పెరిగిందనీ, మరోవైపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 9 ఏళ్లలో దేశంలో ఎయిమ్స్ను మూడింతలు చేశామని అన్నారు. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వ శక్తి అనీ, ఇప్పుడు దేశంలో 20 ఎయిమ్స్ ఉండగా, మరో 3 ఎయిమ్స్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చామని అన్నారు. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర అద్భుతమైన వారసత్వంలో కర్ణాటక చాలా గొప్పదనీ, కర్నాటకకు సంబంధించిన రెండు అంశాలు నన్ను ఎప్పుడూ ఆ వైపుకు లాగుతాయి. కర్నాటకకు ఆధ్యాత్మికతలో సారూప్యత, ఇక్కడ ఆధ్యాత్మికత ప్రజలను ఒకచోట చేర్చి సామాజిక అవగాహన వైపు వారిని ప్రేరేపిస్తున్నాయని అన్నారు.