కాంగ్రెస్ ఫైల్స్: బీజేపీ వీడియో క్యాంపెయిన్.. కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు తీవ్రతరం
కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి కేసులను బీజేపీ ఏకరువు పెట్టింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఫైల్స్ అని ఓ ఎపిసోడ్ను వీడియో రూపంలో ట్వీట్ చేసింది.
న్యూఢిల్లీ: బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు తీవ్రం చేసింది. ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ అంటూ ఓ వీడియో సిరీస్ను ట్వీట్ చేసింది. యూపీఏ హయాంలో విచ్చలవిడి అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఆ వీడియో ఉన్నది.
బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ కాంగ్రెస్ ఫైల్స్ ఫస్ట్ ఎపిసోడ్ను పోస్టు చేసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో 2జీ స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ అవినీతి ఆరోపణలను ఆ వీడియోలో ఏకరువు పెట్టారు.
మూడు నిమిషాల ఈ వీడియో క్లిప్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కనిపించారు. యూపీఏ హయాంలో రూ. 48,20,69,00,00,000 విలువైన స్కామ్లు జరిగాయని ఆ వీడియోలో ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతవారం ప్రతిపక్షాల పై విరుచుకపడుతూ భ్రష్టాచారీ బచావో ఆందోళన్ను ప్రారంభించాయని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే భ్రష్టాచారి బచావో అభియాన్ను కొన్ని పార్టీలు ప్రారంభించాయని వివరించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ప్రధానంగా తీవ్ర అవినీతి ఆరోపణల సవాల్ను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా.. కర్ణాటకలో ఢీ అంటే ఢీ అని బీజేపీతో తలపడుతున్న కాంగ్రెస్ హయాంలోని అవినీతి కేసులను ఏకరువు పెట్టడం గమనార్హం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.