కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో క్యాంపెయిన్ ప్లాన్లు తుది దశకు చేరుకున్నాయి. కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీని నమ్ముకున్నట్టు తెలుస్తున్నది.  

బెంగళూరు: కర్ణాటకలో అధికార బీజేపీ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. 40 పర్సెంట్ కరప్షన్ అనే మాటను కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ అవినీతి ఆరోపణలతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక నేతలపై ప్రజా వ్యతిరేకత ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. వీటికితోడు కాంగ్రెస్ పట్ల సానుకూలతనూ ఈ పార్టీ ఎదుర్కోవాల్సి ఉన్నది. స్థానిక బీజేపీ నేతలపైనే వ్యతిరేకత రావడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువగా కేంద్ర నాయకత్వంపైనే ఆధారపడింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపైనే బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృత ప్రచారం చేయనున్నారు. 

ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనీసం 20 సభలు, ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఆయన బీజేపీ చీఫ్ క్యాంపెయినర్‌గా ఉండనున్నారు. రాష్ట్రంలోని ప్రధానమైన ఆరు రీజియన్‌లలో కనీసం మూడేసి మోడీ సభలు నిర్వహించే ప్రణాళికలు బీజేపీ వేస్తున్నది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో మోడీ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ముఖ్యంగా ఎన్నికల ముందు అంటే మే 10వ తేదీకి ముందు మే 6వ తేదీ నుంచి మే 8వ తేదీ మధ్యలో ఈ రెండు పార్టీల కంచుకోటల్లో విస్తృత ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.

వర్గాల మధ్య ఘర్షణలు, బలమైన ప్రభుత్వ వ్యతిరేకత సెంటిమెంట్ నుంచి ప్రధాని మోడీ ఛరిష్మా మాత్రమే బీజేపీని గట్టెక్కిస్తుందని పార్టీ భావిస్తున్నది. అందుకే ఆరు రీజియన్‌లలో మూడేసి చొప్పున ఆయన సభలు నిర్వహించే ప్లాన్ వేస్తున్నది. హైదరాబాద్ - కర్ణాటక రీజియన్‌ వంటి చోట్ల ఈ సభల సంఖ్య పెంచే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ - కర్ణాటక రీజియన్‌లో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 15 సీట్లలో మాత్రమే బీజేపీ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిగ్గజ నేత ఉన్నారు.

Also Read: చిత్తూరులో కీచక ఉపాధ్యాయుడు.. మోసం చేసి మైనర్ విద్యార్థినితో పెళ్లి.. 33 ఏళ్ల టీచర్ అరెస్టు

రాష్ట్ర బీజేపీ యూనిట్ నేతల ప్రస్తావనను దాదాపుగా లేకుండా చేసి స్థానిక సమస్యలు, కర్ణాటక యోధులు కేంద్రంగా ప్రధాని మోడీ ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. 

అంతేకాదు, అవినీతిపరులైన సొంత పార్టీ నేతలపైనా వేటు వేయడానికి కేంద్ర నాయకత్వం వెనుకడుగు వేయబోదనేలా ప్రసంగాలు ఉండాలని కర్ణాటక బీజేపీ యూనిట్ కేంద్ర నాయకత్వానికి సంకేతాలు ఇచ్చింది. బంధు ప్రీతి, అవినీతిపై బీజేపీ కఠినంగా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లోకి వెళ్లాలేలా క్యాంపెయిన్ చేపట్టాలని పేర్కొన్నట్టు సమాచారం.