ఇది కుటుంబ పరిరక్షణ యాత్ర.. బీజేపీ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని రక్షించేందుకు చేపట్టిన కుటుంబ పరిరక్షణ యాత్ర అని అభివర్ణించింది. భారత్ జోడో యాత్రతో ఆ పార్టీకి ఎలాంటి ఫలితం ఉందని తెలిపింది.
వచ్చే స్వార్వత్రిక ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ జోడో (Bharat Jodo) పేరుతో పాదయాత్రను నేడు శ్రీకారం చుట్టారు. అయితే..ఈ పాదయాత్రపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని రక్షించేందుకు చేపట్టిన కుటుంబ పరిరక్షణ యాత్ర అని అభివర్ణించింది. భారత్ జోడో యాత్రతో ఫలితం శూన్యమని ఏద్దేవా చేసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్రపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. కుటుంబాన్ని కాపాడే యాత్ర అని అభివర్ణించారు. కాంగ్రెస్ తనను తాను కలుపుకోలేకపోయిందని అన్నారు. ఈ యాత్ర ఓ బూటకమనీ, దేశాన్ని బలహీన పరిచే చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నేతగా నిలబెట్టేందుకు చేసే ప్రయత్నమని అన్నారు. పార్టీనే ఐక్యంగా ఉంచడం చేతకాని రాహుల్ గాంధీ.. దేశాన్ని ఎలా రక్షిస్తాడని ఏద్దేవా చేశారు. రాహుల్ తరుచు విదేశీ పర్యటనలు చేస్తాడని, ఆయనకు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించాలని చర్చ నడుస్తుందని అన్నారు. కుటుంబ పరిరక్షణ ప్రచారం కోసం అనివార్యంగా చేపట్టిన యాత్ర ఇదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం.. అంకితభావంతో పని చేసిన నేతలు నేడు పార్టీని వీడుతున్నారని, వారిని కాపాడుకోలేని రాహుల్జీ దేశాన్ని ఏకం చేసేందుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. రాహుల్ జీ, మొదట తన పార్టీని చక్కదిద్దుకుని.. దేశాన్ని అనుసంధానం చేయడం గురించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నగాంధేయులతో పార్టీ మునిగిపోతున్న నౌకలా మారిందనీ, ఇదేమీ దేశ ఐక్యత కోసం చేపట్టిన ప్రయత్నం కాదని విమర్శించారు.
మరోవైపు.. భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫొటో కూడా ఉంది. దీంతో ఈ ఫొటోను షేర్ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పోస్టర్లకు సంబంధించిన ఫొటోను ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన బీజేపీ జాతీయ ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా… ‘‘కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో నిజానికి పరివార్ జోడో. భ్రష్టాచార్ జోడో. మీకేమైన సందేహాలు ఉంటే ఈ పోస్టర్ ను చూడండి’’ అని పేర్కొన్నారు.