సారాంశం
Bangalore: కాంగ్రెస్ అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని సీఎం కార్యాలయం రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చేసిన ఆరోపణలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. "ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన, స్వతంత్ర సంస్థ. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నడుస్తుంది. కాబట్టి, ప్రభుత్వం జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు. తనకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిరోజూ ఉదయం నిరాధార, పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాటన్నింటికీ నేను సమాధానం చెప్పనవసరం లేదని" ఆయన అన్నారు.
Karnataka Assembly Election 2023: వచ్చే నెలలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార బీజేపీ-ప్రతిపక్ష కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ కర్నాటక రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. బీజేపీపై తీవ్ర విమర్శలుగుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ అవినీతి సర్కారును నడుపుతోందనీ, బహిరంగంగానే 40 శాతం కమీషన్ తీసుకుంటున్నదని ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే శనివారం మాట్లాడుతూ, "ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీరును చూసి ప్రజలు విసిగిపోయారు, ఎందుకంటే వారు అవినీతిని ప్రోత్సహించారు. బహిరంగంగానే 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లే నిరూపించారు. ఇది చాలు, వారు ఇతరుల నుండి రక్షణ పొందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అందుకే అవినీతి, మౌలిక సదుపాయాల లేమి, కుల, రిజర్వుడ్ వర్గాల మధ్య విభజన - దుర్మార్గాలు చేస్తున్న బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఐక్యంగా ఉన్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు" అని ఖర్గే అన్నారు.
అలాగే, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సైతం బీజేపీ సైతం తీవ్ర విమర్శల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను అనర్హులుగా ప్రకటించేందుకు బీజేపీ లీగల్ టీం, సీఎం కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయనీ, ఈసీకి ఈ తరహా ఆదేశాలు వెళ్తున్నాయని ఆరోపించారు. సీఎం కాల్ రిజిస్టర్ సేకరించాలని ఈసీఐని కోరుతున్నట్టు తెలిపారు. ఇదే విషయం గురించి సీఎం స్వయంగా అధికారులకు ఫోన్ చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని సీఎం కార్యాలయం రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చేసిన ఆరోపణలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. "ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన, స్వతంత్ర సంస్థ. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నడుస్తుంది. కాబట్టి, ప్రభుత్వం జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు. తనకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిరోజూ ఉదయం నిరాధార, పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాటన్నింటికీ నేను సమాధానం చెప్పనవసరం లేదని" ఆయన అన్నారు.