ఆ 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలూ టచ్లోనే.. మమతకు షాకిస్తాం : మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లోనే వున్నారని.. సరైన సమయం చూసి దీదీకి షాకిస్తామని ఆయన అన్నారు.
బాలీవుడ్ దిగ్గజ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు . 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో ఇంకా టచ్లో వున్నారని తెలిపారు. వారంతా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని మిథున్ అన్నారు. అయితే తృణమూల్ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై తమ నాయకులు కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఆదరణ లేని నాయకులు తమకు అవసరం లేదని మిథున్ చక్రవర్తి స్పష్టం చేశారు.
ఇకపోతే.. ఇప్పటికే మిథున్ చక్రవర్తి ఇలాగే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో వున్నారంటూ ఆయన బాంబు పేల్చారు. 38 మందిలో 21 మంది తనతో మాట్లాడుతున్నారని మిథున్ చక్రవర్తి తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి నెలకొంది.
కాగా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రెసిడెంట్ శరద్ పవార్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం గత అనుభవాలను పక్కన పెట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బుధవారం ముంబయిలో పత్రికా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. గతంలో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకోవడానికి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని విలేకరులు ఆయన ముందు ప్రస్తావించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో టీఎంసీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా? అని అడిగారు. ఇందుకు సమాధానంగా గత అనుభవాలను పక్కన బెడతారని శరద్ పవార్ వివరించారు. జాతీయ ప్రయోజనాల కోసం గత అనుభవాలను పక్కన పెట్టడానికి మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిందని, దీని కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూరిందని ఆయన వివరించారు. జాతీయ ప్రయోజనాల కోసం ఆమె గతాన్ని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్ష కూటమి కోసం ఒక చోట చేరడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.