Asad Ahmed Encounter: "అది బూటకపు ఎన్కౌంటర్.. అసలు బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు"
Asad Ahmed Encounter: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాఫియా డాన్, షార్ప్ షూటర్ అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అసద్ ఎన్కౌంటర్పై సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
Asad Ahmed Encounter: ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడు, మాఫియా డాన్ అతిక్ అహ్మద్ కుమారుడు, షార్ప్ షూటర్ అసద్ అహ్మద్.. యూపీ ఎస్టీఎఫ్ బృందం జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అదే సమయంలో అసద్తో పాటు, షూటర్ గులాం మహ్మద్ కూడా STF చేతిలో హతమయ్యాడు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ క్రమంలో అసద్ ఎన్కౌంటర్పై సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది తప్పుడు ఎన్కౌంటర్ అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
ఉత్తరప్రదేశ్లో బూటకపు ఎన్కౌంటర్ల యుగం నడుస్తుందంటూ.. " తప్పుడు ఎన్కౌంటర్లు చేస్తూ అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీకి కోర్టుపై నమ్మకం లేదు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరపాలి. ఏది ఒప్పో ఏది తప్పో నిర్ణయించే హక్కు శక్తికి లేదు. భాజపా సోదరభావానికి వ్యతిరేకం." అని విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్ ట్వీట్పై.. చాలా మంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మాఫియా డాన్ కొడుకు చంపినందుకు అఖిలేష్ సానుభూతి చూపుతున్నారని, యుపి ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తారని అన్నారు.
మరోవైపు, యుపి ఎస్టిఎఫ్ ఎన్కౌంటర్పై లా అండ్ ఆర్డర్ ఎడిజి ప్రశాంత్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జీరో టాలరెన్స్ విధానంలో ఇటువంటి మాఫియాలు , భయంకరమైన నేరస్థులకు వ్యతిరేకంగా తాము ప్రచారం ప్రారంభించామనీ, ఇలాంటి చర్యలు అర్థవంతమైన ఫలితాలను ఇస్తాయని అన్నారు. ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్లోని ఘూమన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో కీలక సాక్షి ఉమేష్ పాల్ హత్యకు గురయ్యాడు. అందులో ఆ సాక్షి రక్షణ కోసం పనిచేసిన ఇద్దరు వీర సహచరులు వీరమరణం పొందారు.
ఎస్టీఎఫ్, డీజీపీలపై సీఎం యోగి ప్రశంసలు
అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తించిన ఐదుగురికి ఐదు లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. వీరిలో అర్మాన్, అసద్, గుడ్డు , సబీర్ ఉన్నారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత శాంతిభద్రతలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ..పోలీసులతో సమావేశమయ్యారు. యూపీ ఎస్టీఎఫ్తో పాటు డీజీపీ, స్పెషల్ డీజీ లా అండ్ ఆర్డర్, మొత్తం బృందాన్ని సీఎం యోగి ప్రశంసించారు.