బీజేపీ ప్రభుత్వం 'బయట సింహంలా మాట్లాడుతూ.. లోపల ఎలుకలా పనిచేస్తుంది': కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
New Delhi: భారత్ జోడో యాత్ర సందర్భంగా రాజస్థాన్ లోని ఆల్వార్ లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. "కాంగ్రెస్ దేశం కోసం నిలబడి, స్వాతంత్య్రం సాధించడానికి సహాయపడింది. దాని నాయకులు అత్యున్నత త్యాగాలు చేసిన తర్వాత కూడా.. దేశం కోసం బీజేపీ ఒక కుక్క కూడా కోల్పోయిందా" అని పేర్కొన్నారు.
Congress President Mallikarjun Kharge: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై ప్రతిపక్షాలు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కారుపై విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సరిహద్దు వివాదం గురించి చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా, ప్రభుత్వం దీనికి నో అంటోంది. దీంతో ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రంలోని మోడీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వెంబడి చొరబాట్లకు పాల్పడుతున్న చైనాను ఎదుర్కోలేక, పార్లమెంటులో ఈ అంశంపై చర్చ నుంచి పారిపోతున్న బీజేపీ ప్రభుత్వం దేశం వెలుపల సింహంలా మాట్లాడుతూ.. లోపల ఎలుకగా పనిచేస్తోందని మండిపడ్డారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాజస్థాన్ లోని ఆల్వార్ లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. "కాంగ్రెస్ దేశం కోసం నిలబడి, స్వాతంత్య్రం సాధించడానికి సహాయపడింది. దాని నాయకులు అత్యున్నత త్యాగాలు చేసిన తర్వాత కూడా.. దేశం కోసం బీజేపీ ఒక కుక్క కూడా కోల్పోలేదు" అని పేర్కొన్నారు. మతం, కులం, ప్రాంతం ఆధారంగా బీజేపీ దేశ ప్రజలను విభజిస్తోందని పేర్కొన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని బీజేపీ అంతం చేస్తోందని ఆరోపించారు. "తాము చాలా బలంగా ఉన్నామని, తమ కళ్లలోకి ఎవరూ చూడలేరని మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోందనీ, అయితే సరిహద్దుల్లో వివాదాలు, ఘర్షణలు పెరుగుతున్నాయని అన్నారు. గల్వాన్ లో మన సైనికుల్లో 20 మంది అమరులైన తర్వాత మోడీ 18 సార్లు చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. వారు సమావేశాలు నిర్వహించారు.. ఊగిసలాటలు కూడా చేశారు. ఇంత జరిగిన తర్వాత చైనాతో సరిహద్దు వద్ద ఇది ఎందుకు జరుగుతోందని" ఖర్గే ప్రశ్నించారు.
చైనా సమస్యను తాను పార్లమెంటులో మళ్లీ లేవనెత్తానని, సరిహద్దు పరిస్థితిపై చర్చ జరగాలని కోరాననీ, అయితే బీజేపీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని ఖర్గే అన్నారు. "వారు బయట సింహంలా మాట్లాడతారు, కానీ మీరు చూస్తే వారి చర్యలు ఎలుకలా ఉంటాయి. ఈ అంశంపై చర్చించి నోటీసులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము, కాని వారు ఇప్పటికీ పార్లమెంటులో చర్చకు సిద్ధంగా లేరు" అని ఆయన అన్నారు. "దేశం కోసం మీ కుక్క అయినా చనిపోయిందా, ఇప్పటికీ వారు దేశభక్తులమని చెప్పుకుంటారు.. మేము ఏదైనా చెబితే మమ్మల్ని దేశద్రోహి (జాతీయ వ్యతిరేకులు) అని పిలుస్తారు" అని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారనీ, అందరినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సరిహద్దులో చైనా చొరబాట్లపై చర్చ జరగాలన్న తమ డిమాండ్కు అనుమతి ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమని ఖర్గే అన్నారు.
“రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చి ఒక పేజీ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్లిపోయారు. అయితే చైనాతో ఏమి జరుగుతోంది? ప్రభుత్వం ఏమి చేస్తోంది? మన సరిహద్దు, సైనికుల పరిస్థితి ఏమిటి? అనే దానిపై చర్చ అవసరమని ఖర్గే అన్నారు. దేశంతో పాటు దేశ భద్రత కోసం కాంగ్రెస్లో ఉన్నామనీ, అందరం కలిసి దేశాన్ని కాపాడుకుంటామని చెప్పారు. చైనా సరిహద్దు వివాదంపై చర్చకు రాకుండా ఎందుకు దాక్కుని పారిపోతున్నారనీ, ఏం జరుగుతోందని సంబంధించిన సమాచారం మాత్రమే ఆరా తీస్తోందని అన్నారు. "ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తోంది. సంస్థల స్వయంప్రతిపత్తి తగ్గిపోతోంది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్ను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు" అని ఖర్గే ఆరోపించారు.