బిపార్జోయ్ తుఫాన్ ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులు ఓ మహిళ ప్రాణం తీశాయి. గుజరాత్ లో ఈదురుగాలుల వల్ల ఓ చెట్టు కూలి బైక్ పై పడింది. దీంతో బైక్ ఉన్న ఓ మహిళ చనిపోయింది. ఆమె భర్తకు గాయాలు అయ్యాయి.
బిపార్జోయ్ తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లుతోంది. గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లా జస్దాన్ తాలూకాలో తుఫాను ప్రభావం వల్ల సోమవారం బలమైన గాలులు వీచాయి. అయితే ఈ సమయంలో కమలాపూర్-భడ్లా రాష్ట్ర రహదారిపై బైక్ పై దంపతులు ప్రయాణిస్తున్నారు. ఇదే క్రమంలో వారి బైక్ పై చెట్టు కూలడంతో భార్య అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్తకు గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో చనిపోయిన మహిళను వర్షా బవాలియాగా అధికారులు గుర్తించారు. ఆమె సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో తన భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా చెట్టు కూలిందని, దీంతో ఆమెకు తీవ్ర గాయాలవడంతో మరణించిందని జసదన్ తాలూకా మమ్లత్దార్ (విపత్తు విభాగం) అశ్విన్ పడానీ తెలిపారు. జూన్ 15న కచ్ జిల్లాలో తీరం దాటనున్న బిపార్జోయ్ తుపాను కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పారు.
ఇదిలా ఉండగా బిపార్జోయ్ తుఫాన్ ప్రభావం గుజరాత్ , మహారాష్ట్రలపైనే ఎక్కువగా పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. గుజరాత్లో తుపానుకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్కు బదులుగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేింది. కాగా ఈ తుఫానుపై బిపార్జోయ్ ప్రధాని మోడీ అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు.
ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం రవిచంద్రన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుడు కమల్ కిషోర్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర హాజరయ్యారు. తుపానుకు సంబంధించి జూన్ 15న ఉదయం నుంచి సాయంత్రం వరకు కచ్, దేవభూమి ద్వారక, పోర్ బందర్, జామ్నగర్, రాజ్కోట్, జునాగఢ్, మోర్బీలలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సమావేశంలో వివరించారు.
పెళ్లికి ముందే సహజీవనం... బాత్రూంలో నగ్నంగా యువజంట మృతదేహాలు
మరోవైపు తుపాను దృష్ట్యా 67 రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే సీపీఆర్వో తెలిపారు. గుజరాత్లోని బిపార్జోయ్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు 56 రైళ్లు రద్దు అయ్యాయి. నిన్నటి నుండి జూన్ 15 వరకు 95 రైళ్లు రద్దు అయ్యాయి. అరేబియా సముద్రంలో బీపర్జోయ్ తుపాను ప్రభావంతో ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని ఓ ప్రైవేట్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
