బాంబ్ బైక్లో పెట్టుకుని కూరగాయల మార్కెట్కు.. క్యారీ బ్యాగ్ తీస్తుండగా పేలిన బాంబ్!.. జార్ఖండ్లో ఘటన
జార్ఖండ్లోని ధన్బాద్ మార్కెట్లో బాంబు పేలింది. కూరగాయలు కొనుక్కోవడానికి బైక్ పై వచ్చిన వ్యక్తి ఆ వాహనంలో నుంచి క్యారీ బ్యాగ్ తీస్తుండగా బాంబ్ పేలినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో బైక్ పై వచ్చిన వ్యక్తి మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రాంచీ: జార్ఖండ్లో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బాంబ్ను బైక్లో పెట్టుకుని కూరగాయల మార్కెట్కు వెళ్లినట్టు తెలుస్తున్నది. అక్కడ కూరగాయల కోసం క్యారీ బ్యాగ్ తీస్తుండగా బైక్ డిక్కీలోని బాంబ్ ఒక్కసారిగా పేలిపోయినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో బైక్ పై వచ్చిన వ్యక్తి సహా కూరగాయలు అమ్ముకుంటున్న నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధన్బాద్లోని తోప్చాంచి మార్కెట్లో జరిగింది. క్షతగాత్రులను ధన్బాద్ ఎస్ఎన్ఎంఎంసీహెచ్ హాస్పిటల్లో చేర్పించారు.
ఘటన గురించి తెలియగానే తోప్చాంచీ పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకున్నారు. కేసులో దర్యాప్తు ప్రారంభించారు. ఓ వ్యక్తి బాంబ్ను బైక్లో పెట్టుకుని మార్కెట్కు వచ్చాడని, అందులో ఉండగానే బాంబ్ పేలిందని పోలీసులు తెలిపారు.
మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్నవారు ఈ ఘటనతో ఒక్కసారిగా హతాశయులయ్యారు. ఆ బాంబ్ బైక్ లో నుంచి పేలిందా? లేక వేరే ఎవరైనా ఇక్కడ పేల్చేశారా? అనేది అర్థం కావడం లేదని అన్నారు. ఆ బైక్ రైడర్ మాత్రం తన బైక్ లో నుంచే బాంబ్ పేలిందని చెప్పాడని వారు పేర్కొన్నారు.
అయితే, ఆ వ్యక్తి తెలిసే బాంబ్ను తన బైక్లో తీసుకువచ్చాడా? లేక ఇంకా ఎవరైనా కుట్రపూరితంగా బైక్ డిక్కీలో బాంబ్ అమర్చారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాంబు పేలుడు ఘటన చోటుచేసుకోగానే ఆ ఏరియా మొత్తం పోలీసులు సీజ్ చేశారు.