కశ్మీర్ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ప్రశ్నపత్రం.. వివాదాన్ని రేపిన బిహార్ కొశ్చన్ పేపర్
బిహార్లో ఏడో తరగతి పరీక్షా పత్రంలో కశ్మీర్ను వేరే దేశంగా పేర్కొంటూ ఓ ప్రశ్న వచ్చింది. దీంతో బీజేపీ నేతలు విమర్శలు కురిపించారు. అయితే, ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు వివరణ ఇచ్చారు. ఎంఐఎం నేతలు కూడా దీనిపై స్పందించారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ గురించిన ఏ చిన్న విషయమైనా సున్నితమైనదే. కశ్మీర్ గురించిన ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. అదీ అకడమిక్ పరంగానైతే రెట్టింపు జాగ్రత్తలు అవసరం. కానీ, బిహార్లో ఏడో తరగతికి బిహార్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి వచ్చిన కొశ్చన్ పేపర్ కొత్త వివాదాన్ని రేపింది. ఇందులో కశ్మీర్ను వేరే దేశంగా పేర్కొన్నారు.
బిహార్లోని కిషన్గంజ్ స్కూల్లో ఏడో తరగతి విద్యార్థులకు ఇచ్చిన కొశ్చన్ పేపర్లో కశ్మీర్ గురించిన ప్రశ్నలు వివాదాన్ని రేకెత్తించాయి. కింది ఐదు దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు అనే బిట్ కొశ్చన్ పేపర్లో ఉన్నది. ఆ బిట్లో ఐదు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ఐదు ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
చైనా ప్రజలను ఏమని పిలుస్తారు? నేపాల్ ప్రజలను ఏమని పిలుస్తారు? ఇంగ్లాండ్ ప్రజలను ఏమని పిలుస్తారు? కశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు? ఇండియా ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఉన్నది. కశ్మీర్ను ఇండియాలో భాగంగా కాకుండా వేరే దేశంగా పేర్కొంటూ ఆ ప్రశ్న ఉన్నది. ఈ విషయం వెలుగులోకి రాగానే బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.
Also Read: మతాలు ద్వేషాన్ని నేర్పవు.. భిన్నమతాలైనా అవే మనందరినీ కలిపి ఉంచుతాయి: ఫరూఖ్ అబ్దుల్లా
జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుశాంత్ గోపే మాట్లాడుతూ, మహాఘట్బంధన్ సంతుష్టికర రాజకీయాలు చేయడానికి ఇదొక అటెంప్ట్ అని విమర్శించారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదని పిల్లల మెదళ్లలోకి చొప్పించడమే ఈ ప్రయత్నం అని పేర్కొన్నారు. ఇది అనుకోకుండా జరిగిన తప్పు కాదని, వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం నితీష్ కుమార్ అల్లిన కుట్ర అని ఆరోపణలు చేశారు.
స్కూల్ అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. ఈ కొశ్చన్ పేపర్ను ప్రభుత్వ పాఠశాలల కోసం బిహార్ ఎడ్యుకేషన్ బోర్డు సెట్ చేసిందని వివరించారు. ఒరిజినల్ కొశ్చన్ పేపర్ ఉద్దేశం వేరని వారు తెలిపారు. కశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు? అనే ప్రశ్న అందులో రావాలని, కానీ, దాన్ని వేరే దేశంగా పేర్కొంటూ ప్రశ్న వచ్చిందని, ఇది మానవ తప్పిదం అని వివరించారు. అందువల్లే తప్పుగా ప్రింట్ అయిందని తెలిపారు.
ఏఐఎంఐఎం నేత షహీద్ రబ్బానీ ఈ విషయంపై స్పందించారు. ఇది ఒక వేళ మానవ తప్పిదం అయితే.. వెంటనే సరిదిద్దుకోవాలని అన్నారు. కానీ, ఇది ఉద్దేశపూర్వకంగానే చేస్తే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని, దీని చుట్టూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.