మతాలు ద్వేషాన్ని నేర్పవు.. భిన్నమతాలైనా అవే మనందరినీ కలిపి ఉంచుతాయి: ఫరూఖ్ అబ్దుల్లా
మన మతాలు వేరు కావొచ్చు. కానీ, అవే మనందరినీ కలిపి ఉంచుతాయి. ఏ మతమూ ద్వేషాన్ని నేర్పదు. ఇది హిందుస్తాన్. ఇది మనందరిదీ అంటూ ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
న్యూఢిల్లీ: ఎన్సీపీ సీనియర్ లీడర్ ఛగన్ భుజ్బల్ 75వ జన్మదిన వేడుకలను ముంబయిలో ఎన్సీపీ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎన్సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఫరూఖ్ అబ్దుల్లా కేంద్రంపై విమర్శలు సంధించారు. అలాగే, భారతీయులంతా కలిసి ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు.
ఢిల్లీలో ఓ కమ్యూనిటీని పూర్తిగా బహిష్కరించాలనే బీజేపీ నేత పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘మేం మీ వెంట ఉన్నాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమంతా ఈ దేశాన్ని ఒకటిగా ఉంచాలి. నేను ఒక ముస్లింను. ఒక భారతీయ ముస్లింను, చైనీస్ ముస్లింను కాదు’ అని తెలిపారు.
‘ప్రతి ఒక్కరు వేరుగా ఉండొచ్చేమో. కానీ, మనమంతా కలిస్తేనే దేశాన్ని నిర్మించవచ్చు. దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. మతం ఇతరులను ద్వేషించాలని చెప్పదు. మన మతాలు వేరు కావొచ్చు. కానీ, అవే మనందరినీ కలిపి ఉంచుతాయి. ఇది హిందుస్తాన్. ఇది మన అందరికీ చెందినది’ అని వివరించారు.
Also Read: Kashmiri Pandits: కాశ్మీరీ పండిట్లపై దాడులు.. కేంద్రంపై ఫరూక్ అబ్దుల్లా ఫైర్ !
కాగా, ఈ సమావేశంలో శరద్ పవార్ ఓ జోక్ విసిరారు. ఫరూఖ్ అబ్దుల్లా త్వరలోనే 85వ పడిలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కామెంట్ చేశారు. 85 ఏళ్ల ఉన్నప్పటికీ మీరు ఇంకా యవ్వనంగానే ఉన్నారు అని అన్నారు. దీంతో శరద్ పవార్ వెంటనే కలుగజేసుకుని ఫరూఖ్ అబ్దుల్లాపై కామెంట్ చేశారు. ఆయన 85 సంవత్సరాలు కాదు.. 58 సంవత్సరాలు మాత్రమే అని ఛమత్కరించారు. దీంతో అక్కడ ఉన్నవారి ముఖాల్లో నవ్వులు పూశాయి. ఈ సమావేశంలో కీలక నేతలు ఒక చోట చేరడం చర్చనీయాంశమైంది.