బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా
Bihar: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సహా స్థానిక పార్టీలతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బీహార్ వ్యవసాయ మంత్రి సుధాకర్ సింగ్ ప్రమాన స్వీకారం చేశారు.
Bihar Agriculture Minister Sudhakar Singh: సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా చేశారు. వ్యవసాయ రోడ్ మ్యాప్లను ప్రశ్నిస్తూ ఇటీవల తన సొంత ప్రభుత్వ విధానాలను విమర్శించిన బీహార్ వ్యవసాయ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా చేసినట్లు ఆయన తండ్రి, రాష్ట్రీయ జనతాదళ్ బీహార్ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఆదివారం తెలిపారు. ఆర్జేడీ ఎమ్మెల్యే ఇటీవల తన శాఖలో అవినీతి సమస్యను ధ్వజమెత్తారు. శనివారం కూడా రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తన శాఖలో బీజేపీ ఎజెండాను కొనసాగించడాన్న తాను అనుమతించబోనని అన్నారు. తన రాజీనామా లేఖను ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు పంపినట్లు సమాచారం.
కాగా, తన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మాత్రమే తాను జవాబుదారీ అని సుధాకర్ సింగ్ తేల్చిచెప్పారు. రైతులకు సంబంధించిన సమస్యలను లేవనెత్తుతున్న బీహార్ వ్యవసాయ మంత్రి తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు. "ప్రభుత్వానికి ఇబ్బంది కలుగజేస్తూ.. దీనిన మరింత లాగడం మాకు ఇష్టం లేదు" అని రాష్ట్రీయ జనతాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఆయన తండ్రి జగదానంద్ సింగ్ అన్నారు. ''రైతులకు, వారికి జరుగుతున్న అన్యాయానికి ఎవరైనా అండగా నిలవాలి. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండి చట్టాన్ని (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ యాక్ట్) హతమార్చడం రాష్ట్ర రైతులను నాశనం చేసింది” అని జగదానంద్ సింగ్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. 2006లో రద్దు చేసిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) చట్టాన్ని, ‘మండి’ విధానాన్ని పునరుద్ధరించేంత వరకు తాను విశ్రమించబోనని అక్టోబర్ 1న వ్యవసాయ మంత్రిగా ఉన్న సుధాకర్ సింగ్ ప్రకటించారు. వాటిని రద్దు చేయాలనే నిర్ణయం రైతు వ్యతిరేకమైనదని అన్నారు.
కాగా, 46 ఏండ్ల సుధాకర్ సింగ్.. జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ లతో కూడిన మహాఘట్బంధన్ (మహా కూటమి) ప్రభుత్వంలో మొదటిసారి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. రాష్ట్రంలోని గత 2020 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ టిక్కెట్పై కైమూర్ జిల్లాలోని రామ్గఢ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. “రాష్ట్రంలో మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా శాఖలో బీజేపీ ఎజెండాను కొనసాగించడాన్ని నేను అనుమతించను” అని సింగ్ అన్నారు. ఇటీవల ఆయన తన శాఖలోని అధికారులందూ దొంగలు, దానికి అధిపతిగా ఉన్నందున దొంగలకు అధిపతి (చోరో కా సర్దార్) అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. "తన శాఖ అధికారులు లంచం డిమాండ్ చేస్తే, బూట్లతో కొట్టండి" అని ప్రజలు సూచించారు.
ఇటీవల ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ , "సమస్య ఏమిటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజల సమస్యలను లేవనెత్తుతూ ఉంటారు, కానీ మీరు ప్రభుత్వంలో భాగమైన తర్వాత మీరు అదే వ్యక్తులతో కలిసిపోయి.. సమస్యలతో డిస్కనెక్ట్ అవుతారు" అని సుధాకర్ సింగ్ అన్నారు. "నేను దానిని జరిగేలా చేయను. ఎవరైనా ఇష్టపడినా, ఇష్టపడకపోయినా రాష్ట్రంలోని నా నియోజక వర్గంలోని రైతుల బాధలను నేను లేవనెత్తుతూనే ఉంటాను. రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న నేను రైతుల సమస్యలపై ఎందుకు ధ్వజమెత్తకూడదో ఎవరైనా చెప్పగలరా? అది కూడా, మన రాష్ట్ర జనాభాలో 80% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పుడు” అని సుధాకర్ సింగ్ ప్రశ్నించారు. అయితే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి సర్కారుకు సుధాకర్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి.