భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలకు నిర్ణయాత్మక ఘట్టం- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్
భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలకు నిర్ణయాత్మక ఘట్టం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ఇది తమ పార్టీ నాయకుల్లో కూడా నూతనోత్సాహం నింపుతుందని, పార్టీని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు బూస్టర్ డోస్ అని, దేశ రాజకీయాలకు నిర్ణయాత్మక, పరివర్తన క్షణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఐదు నెలల పాటు 3570 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా కార్యకర్తలు బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రజలతో మమేకమవుతారని అన్నారు. ఇది కాంగ్రెస్ సంస్థాగత బలాన్ని పెంచుతుందని చెప్పారు.
ప్రధాని మోడీపై యూఎస్ మీడియా ప్రశంసలు.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆ మాట అన్నందుకే..!
భారతదేశం ఇప్పటికే ఐక్యంగా ఉందని, యాత్ర చేపట్టి దానిని తిరిగి కలపాల్సిన అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై రమేష్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ ప్రధానంగా మూడు కారణాల వల్ల దేశం విచ్ఛిన్నమవుతుందని నేను ఆయనకు చెప్పాలని అనుకుంటున్నాను. అందులో మొదటిది ఆర్థిక అసమానత, రెండోది సామాజిక ధ్రువణత, మూడోది రాజకీయ నిరంకుశత్వం. ’’ అని ఆయన చెప్పారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రధాన ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధనికులు, పేదల మధ్య అంతరాన్ని పెంచాయని ఆయన ఆరోపించారు. రాజకీయ రంగంలో కూడా రాజ్యాంగ కార్యాలయాలు బలహీనపడుతున్నాయని అన్నారు. రాష్ట్రాల హక్కులు తగ్గిపోతున్నాయని తెలిపారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి నిరంకుశ విధానాల వల్లే విభజన రాజకీయాలు జరుగుతున్నాయని జైరాం రమేష్ తీవ్రంగా విమర్శించారు.
జాతీయ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే చిరుతల విడుదల - కాంగ్రెస్
కొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడడంపై రమేష్ను ప్రశ్నించగా.. అలాంటి నాయకులను రెండు వర్గాలుగా విభజించవచ్చని చెప్పారు. ‘‘ మొదట 30-40 ఏళ్లుగా పార్టీ నుండి ప్రతిదీ తీసుకున్నవారు ఇప్పుడు వారి సొంత ప్రయోజనాల కోసం పార్టీని విడిచిపెట్టారు. మరి కొందరు రాజకీయాల్లో కొనసాగడానికి, తమ అవినీతి మరకలను తొలగించడానికి వారికి బీజేపీ వాషింగ్ మెషీన్ అవసరం అయ్యింది. అస్సాం సీఎం కూడా ఇదే కోవలోకి వస్తారు. ఆయన కొన్నాళ్లు మాతో ఉన్నారు. అంతకు ముందు ‘తుక్డే తుక్డే’ సంస్థలతో ఉన్నారు ’’ అని చెప్పారు. హిమంత బిస్వా శర్మను దివంగత సీఎం హితేశ్వర్ సైకియా రక్షించారని, అద్దాల ఇళ్లలో నివసించేవారు ఇతరులపై రాళ్లు రువ్వకూడదని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయని మీడియా ప్రశ్నించినప్పుడు.. దేశంలోనే తమది అత్యంత పురాతనమైన పార్టీ అని, అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే ఏకైక పార్టీ అని చెప్పారు. ఇందులో ఏ సభ్యుడు అయినా పోటీ చేవచ్చని జైరాం రమేష్ చెప్పారు.
కూనో నేషనల్ పార్క్లో చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ..
భారత్ జోడో యాత్ర విషయంలో మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భద్రత, భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకుని మార్గాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి అస్సాంలో యాత్ర ప్రారంభమవుతుందని, ఇందులో పలువురు స్థానిక, జాతీయ నాయకులు పాల్గొంటారని జైరాం రమేష్ చెప్పారు. ఈ ప్రయాణం పశ్చిమాన ధుబ్రి నుండి తూర్పున సాదియా వరకు ఉంటుందని అన్నారు. వచ్చే ఏడాది పశ్చిమాన ఉన్న పోర్బందర్ నుంచి తూర్పున ఉన్న పరశురామ్ కుండ్ వరకు యాత్రను ప్లాన్ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.