Asianet News TeluguAsianet News Telugu

Mamata banerjee: భవానీపూర్ ఉప ఎన్నిక రద్దు పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశం

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ ఉపఎన్నిక ఇప్పుడు రద్దు చేసి వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై కోట్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు వెల్లడించింది. ఎన్నికల సంఘం ప్రకటన మేరకే ఈ ఎన్నికలు జరుగుతాయని, ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని స్పష్టం చేసింది.
 

bhabanipur bypoll can not be cancelled rules kolkata high court
Author
Kolkata, First Published Sep 28, 2021, 1:12 PM IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేయనున్న భవానీపూర్ నియోజకవర్గ ఉపఎన్నిక రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 4న ప్రకటన చేసిందని వివరించింది. ప్రస్తుత దశలో ఈ ఉపఎన్నిక నిలిపేయాలని ఆదేశించడానికి సరైన కారణాలు కనిపించట్లేవని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతుందని తీర్పుచెప్పింది. అయితే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై మండిపడింది.

భవానీపూర్ ఉపఎన్నికపై సయాన్ బెనర్జీ ఓ పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత తొందరగా భవానీపూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించాలని, లేదంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ లేఖ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపారు. కాబట్టి, ఈ ఉపఎన్నికను వాయిదా వేయాలని ఆదేశించాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై ఎన్నికల సంఘం స్పందిస్తూ పిటిషనర్ వాదనలు ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహించింది. రాజ్యాంగ అత్యవసరస్థితిని ఆయన తప్పుగా అర్థం చెబుతున్నారని తెలిపింది. ఈ తీర్పునిస్తూ కోల్‌కతా హైకోర్టు సీఎస్‌పై సీరియస్ అయింది. ఆయన ప్రజాసేవకుడని, చట్టబద్ధంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించాలని హితవు పలికింది. అంతేకానీ, అధికారంలోకి రావడానికి ఏ వ్యక్తికి ఆయన సహకరించాల్సిన పనిలేదని వివరించింది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి సువేందు అధికారిపై ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేయడానికి అనుకూలంగా అక్కడ గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఈ స్థానంతోపాటు మరో రెండు చోట్ల ఈ నెల 30న ఉపఎన్నికలు జరగనున్నాయి. మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి 2011, 2016లలో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగడానికి ఆరు నెలల్లోపు ఆమె శాసన సభ లేదా మండలి సభ్యురాలు కావాల్సిన అవసరముంది.

Follow Us:
Download App:
  • android
  • ios