*మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న సీఎం సోదరుడు*జ్యోతిష్యుడు చెప్పిన మాటలను గుడ్డిగా ఆచరిస్తున్న మంత్రి 

ప్రజలు మూఢనమ్మకాలపై విశ్వాసం పెంచుకుంటే.. వాటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాంటి ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రే.. ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను గుడ్డిగా ఆచరిస్తున్నారు. ఆ మంత్రి ఎవరో కాదు..కర్ణాటక సీఎం సోదరుడు రేవన్న. ఆయన పీడబ్ల్యూడీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అసలు మ్యాటరేంటంటే... రేవన్నకు ఇంకా ప్రభుత్వం అధికారిక వసతి ఏర్పాటుచేయలేదు. ఆయనకు బాణశంకరి ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. అయితే రేవన్న రాత్రిళ్లు తన సొంతింట్లో ఉండకూడదని రోజూ బెంగళూరు నుంచి హోలెనరసిపుర వరకు ప్రయాణాలు చేస్తున్నారు. 

ఎందుకంటే బెంగళూరులోని తన సొంతింట్లో రాత్రిళ్లు నిద్రపోవడం మంచిది కాదని, అలా చేస్తే చెడు జరుగుతుందని రేవన్నకు ఓ జోతిష్యుడు చెప్పాడట. కేవలం ప్రభుత్వం కేటాయించిన భవనంలోనే ఉండాలని సలహా ఇచ్చాడట. రేవన్న జోతిష్యాన్ని బాగా నమ్ముతారు. దాంతో రాత్రిళ్లు తన ఇంట్లో ఉండకుండా రోజూ ప్రయాణాలు చేస్తున్నారట.

మరో విషయం ఏంటంటే.. రేవన్నకు కుమార పార్క్‌ వెస్ట్‌ ప్రాంతంలో ఓ భవనాన్ని కేటాయించారు. అయితే అందులో మాజీ మంత్రి మహదేవప్ప నివసిస్తున్నారు. ఆయన ఈ భవనం ఖాళీ చేయడానికి మూడు నెలల సమయం ఉంది. ఈ భవనం వల్లే మహదేవప్ప గతంలో మంత్రి అయ్యారని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. 

అందువల్ల ఈ భవనం తనకు కూడా కలిసొస్తుందని భావించిన రేవన్న.. అది ఖాళీ అయ్యేవరకు ఇలా ప్రయాణిస్తూనే ఉంటారని అతని సన్నిహితులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల తన బ్యాడ్ లక్ పోయి మంచి జరుగుతుందని ఆయన విశ్వసిస్తున్నారు.