అనాథ బిడ్డకు పాలిచ్చి ఆకలితీర్చిన మహిళా కానిస్టేబుల్(వీడియో)
అర్చనా నీకు సెల్యూట్
ఓ మహిళా కానిస్టేబుల్ తన తల్లిప్రేమను చాటుకుంది. కన్న తల్లి వద్దనుకోని పుట్టగానే వదిలేసిన ఓ బిడ్డ ఆకలిని మహిళా కానిస్టేబుల్ తీర్చింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ప్లాస్టిక్ బ్యాగులో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై నగేశ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆ పసికందును పరిశీలించారు. బ్యాగ్లో రక్తం, బొడ్డు తాడు ఉండటంతో అప్పుడే పుట్టిన చిన్నారిగా నిర్ధారించారు. వెంటనే ఆ మగ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు ఉచితంగా చికిత్స అందించారు. ఆపై కాస్త కోలుకున్నాక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
అయితే ఆకలితో ఆ పసిగుడ్డు గుక్కపట్టి ఏడ్వటం ప్రారంభించింది. అది గమనించిన కానిస్టేబుల్ అర్చన ఆ చిన్నారిని ఒళ్లోకి తీసుకుని పాలు పట్టించారు. అర్చన మూడు నెలల బాబుకు తల్లి. ఈ మధ్యే మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరారు. ‘ఏడుస్తుంది నా బిడ్డే అనిపించింది. చూసి తట్టుకోలేకపోయా. అందుకే ఆ బాబుకు పాలిచ్చా’ అని అర్చన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అర్చనపై ప్రశంసలు... ఈ విషయం తన దృష్టికి రావటంతో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి.. ఆ మహిళా కానిస్టేబుల్పై ప్రశంసలు గుప్పించారు.‘ఈ ఉదంతం కదిలించింది. ఆ చిన్నారి ఆకలిని తీర్చిన ఆ తల్లికి వందనాలు’అని బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
బెంగళూరు సిటీ పోలీసులు కూడా ఫేస్ బుక్ పేజీలో ‘అర్చనకు సెల్యూట్’ పేరిట ఓ సందేశం ఉంచారు. మరోవైపు ఈ కథనం చూసిన ప్రజలు కూడా ఆ తల్లి హృదయానికి సలాం కొడుతున్నారు. అన్నట్లు ఆ బిడ్డకు కుమారస్వామి అన్న పేరు పెట్టిన ఏఎస్సై నగేశ్.. ఇకపై ఆ పసికందు బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రకటించారు