Viral: బెంగళూరు కోచింగ్ సెంటర్ నుంచి ఆరో తరగతి స్టూడెంట్ పరార్.. మూడు రోజుల తర్వాత నాంపల్లి మెట్రో స్టేషన్లో.
బెంగళూరు కోచింగ్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు అదృశ్యమైన ఆరో తరగతి బాలుడు మూడు రోజుల తర్వాత హైదరాబాద్లో కనిపించాడు. బెంగళూరు నుంచి మైసూరు, చెన్నైల మీదుగా హైదరాబాద్కు వెళ్లాడు. తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోతో ఓ ప్రయాణికుడు బాలుడిని గుర్తించి సమాచారం ఇచ్చాడు.
![bengaluru 12 year old boy fled from coaching centre, spot in hyderabad after three days kms bengaluru 12 year old boy fled from coaching centre, spot in hyderabad after three days kms](https://static-ai.asianetnews.com/images/01hmwsh8wnvhtxb9wdjyyfmc0k/boy_363x203xt.jpg)
Viral: బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు కోచింగ్ సెంటర్ నుంచి పారిపోయాడు. మూడు రోజులపాటు కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల్లో బాలుడు కనిపించిన ఏరియాల్లోకి పోలీసులు వెంటనే వెళ్లినా.. అప్పటికే ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇలా మూడు రోజులపాటు ఆ బాలుడి కోసం తీవ్ర వేట జరిగింది. అయితే.. తల్లిదండ్రులు ఆ ఫుటేజీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు. దీంతో హైదరాబాద్లోని నాంపల్లి మెట్రో స్టేషన్లో ఆ బాలుడిని ఓ ప్రయాణికుడు చూశాడు. ఆ బాలుడిని ప్రశ్నించి వివరాలు పోల్చుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఆ బాలుడు మూడు రోజులపాటు మూడు నగరాలు తిరిగి.. హైదరాబాద్లో చిక్కాడు.
ఆరోర తరగతి చదువుతున్న డీన్స్ అకాడమీ స్టూడెంట్ పరిణవ్ బెంగళూరులోని వైట్ ఫీల్డ్లోని కోచింగ్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత సాయంత్రం 3 గంటల ప్రాంతంలో యెమ్లూర్ పెట్రోల్ పంప్ వద్ద కనిపించాడు. చివరిగా ఆయన బెంగళూరులోని మెజెస్టిక్ బస్ టర్మినస్ వద్ద సాయంత్రం కనిపించాడు. అక్కడి నుంచి కర్ణాటకలోని ప్రతి మూలకు, రాష్ట్రం అవతలకు కూడా వెళ్లే సదుపాయం ఉంటుంది.
పరిణవ్ బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లాడు. ఆ తర్వాత చెన్నై.. అనంతరం హైదరాబాద్కు వెళ్లాడు. కోచింగ్ సెంటర్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన వద్ద రూ. 100 ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని పార్కర్ పెన్లను అమ్ముకున్నాడు. ఖరీదైన ఒక్కో పార్కర్ పెన్కు వంద రూపాయల చొప్పున బేరం పెట్టి అమ్మేశాడు. పెన్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పటి సీసీటీవీ ఫుటేజీలు కూడా బయటికి వచ్చాయి.
Also Read : INDIA Bloc: ఇండియా కూటమి గట్టి దెబ్బ.. కాంగ్రెస్తో పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం: మమతా బెనర్జీ సంచలనం
ఆ బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును చూసినవారు ఆచూకీ తెలియజేయాలని కోరుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంటికి తిరిగి రావాలని కొడుకును బ్రతిమిలాడుతూ మరో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. బుధవారం హైదరాబాద్లో ఆ బాలుడి ఆచూకీ లభించింది.