ఆ రెండు పార్టీలతో అప్రమత్తంగా ఉండండి.. ముస్లిం నేతలతో బీహార్ సీఎం ప్రత్యేక భేటీ ..
మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ సహా ఏఐఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తోందని, ఆ రెండు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హెచ్చరించారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ బీజేపీకి బీ-టీమ్ అని ఆరోపించారు.
బీజేపీ, ఆల్ ఇండియా ముస్లీం ఇత్తెహదుల్ ముస్లిమీన్( ఎంఐఎం) పార్టీలను టార్గెట్ చేస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లింలను హెచ్చరించారు. ఆ పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది (2024) ఎన్నికలకు ముందు.. బీజేపీ యాక్టివ్గా మారి మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తుందని నితీశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముస్లిం మేధావులకు నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ముస్లిం మేధావులతో నితీశ్ కుమార్ సోమవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధావులను ఉద్దేశించి నితీశ్ మాట్లాడుతూ.. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ సహా అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం పార్టీ కూడా ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ బీజేపీకి బీ-టీమ్గా ఉండి పార్టీ పట్ల ముస్లిం సమాజం జాగ్రత్త వహించాలని సీఎం హెచ్చరించారు. ముస్లిం ఓట్ల చీలిక కోసం.. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు మతతత్వ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఫలితంగా ముస్లిం ఓట్లు చీలిపోతాయని హెచ్చరించారు.
విపక్షాలకు ప్రధానమంత్రి అభ్యర్థి దొరికారా?
గత 18 ఏళ్లలో బీహార్లో ముస్లింల అభ్యున్నతి , అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎలా పని చేసిందో ఈ సమావేశంలో నితీష్ కుమార్ చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా.. బీహార్లో 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీమాంచల్ ప్రాంతంలో AIMIM కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు ఏ మేరకు విభజించబడిందో, దాని కారణంగా RJD భారాన్ని మోయవలసి వచ్చిందని నితీష్కు తెలుసు.
2024 నాటికి విపక్షాలను కూడగట్టేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓటు బ్యాంకును ఏకం చేసి చీలిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది. నితీష్ భేటీపై బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సరోగీ మాట్లాడుతూ.. ముస్లిం మేధావులతో నితీశ్ భేటీ బీహార్ సీఎం, మతతత్వ నాయకుడని, సమాజాన్ని విభజించాలనుకుంటున్నారని సూచిస్తోందని అన్నారు.