భారత్ కోసం పోరాటం భవిష్యత్ లో జరుగుతుందని, అది ఏంటనేది 2024లో నిర్ణయమవుతుందని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో (five state election results) బీజేపీ (bjp) సత్తా చాటడంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ (kcr) , మమతా బెనర్జీ (mamata banerjee) వంటి వారు కూటములు కడుతున్న నేపథ్యంలో ఇలాంటి వారందరి అంచనాలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ (prashant kishor) స్పందించారు.
భారత్ కోసం పోరాటం భవిష్యత్ లో జరుగుతుందని, ఆ పోరాటం ఏంటనేది 2024లో నిర్ణయమవుతుందని పీకే అన్నారు. ఏదో ఒక రాష్ట్ర ఎన్నికల్లో కాదని .. ఈ విషయం సాహెబ్కు బాగా తెలుసునని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బ తీసేందుకు లేనిపోని ఘర్షణాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. కాబట్టి అలాంటి అసత్య కథనాలు, తప్పుడు వ్యాఖ్యానాలకు ఎవరూ పడిపోవద్దని ఆయన సూచించారు.
కాగా, నిన్న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, పంజాబ్ లో (punjab elections result) ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ వంటి దిగ్గజ పార్టీలను సైతం మట్టికరిపించి ఆప్ 92 స్థానాలు సాధించి పంజాబ్ను ఊడ్చేసింది.
అటు యూపీలో (up election results) గతంతో పోలీస్తే సీట్లు తగ్గినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీ స్థానాలను మించి బీజేపీ సాధించింది. మిత్ర పక్షాల సాయం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా 255 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గోవాలో సరిగ్గా సగం సీట్లు సాధించిన కాషాయ పార్టీ.. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతివ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సోషల్ మీడియా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనుక పీకే వ్యూహాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
బలహీన కాంగ్రెస్కు బదులు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలే ఒక కూటమిగా ఏర్పడాలనే ఆలోచనలు చేస్తున్నాయి. 2024 జనరల్ ఎన్నికల్లో బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమిగా ఏర్పడి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) చురుకుగా ఉన్నారు.
