భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత నియోజకవర్గం బంకిపూర్ ఉపఎన్నికలో ఊహించని పలితం వెలువడింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహకందని విధంగా విజయం సాధించారు.
Bankipur By Election Result 2026 : బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన బీజేపీ కంచుకోటను బద్దలుగొట్టాడు. అధికార బిజెపి అభ్యర్థి నీరజ్ కుమార్ ను ఓడించి అద్భుత విజయం సాధించాడు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా ఇక్కడ మూడో స్థానానికి పరమితం అయ్యారు.
బంకిపూర్ ఉప ఎన్నికను ప్రశాంత్ కిషోర్ తో పాటు బిజెపి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే దశాబ్దాలుగా బిజెపిని గెలిపించుకుంటూ వస్తున్న బంకీపూర్ ప్రజలు ఈసారి స్పష్టమైన మార్పు కోరుకున్నారు... అందుకే షాకింగ్ రిజల్ట్ ఇచ్చారు. ఇటీవలే బంకీపూర్ లో పోలింగ్ జరగ్గా ఇవాళ (ఆగస్ట్ 3న) ఓట్ల లెక్కింపు జరిగింది... తొలి రౌండ్ నుండి ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు. దీంతో అతడి విజయం ముందుగానే ఖాయం అయ్యింది... అయితే మెజారిటీ ఎంత ఉంటుందనే అందరూ ఎదురుచూశారు. చివరకు 18,964 ఓట్ల భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు.
బిజెపి బాస్ కు బిగ్ షాక్..
బంకీపూర్ అసెంబ్లీ బిజెపి కంచుకోట. ప్రస్తుత బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడిగా అత్యున్నత బాధ్యతలు పొందాడు... ఇలా అతడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అతడిని రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసింది బిజెపి.
ఎమ్మెల్యేగా నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బంకీపూర్ అసెంబ్లీకి ఉపఎన్నికలు వచ్చాయి. 1995 నుండి ఇప్పటివరకు అంటే దాదాపు 30 ఏళ్లకు పైగా ఈ అసెంబ్లీలో బిజెపిదే విజయం... ఈసారి బిహార్ లో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విజయం నల్లేరుపై నడకే అని అందరూ భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగడంతో ఈ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. చివరకు బంకీపూర్ చరిత్రను తిరగరాస్తూ ప్రశాంత్ కిషోర్ అద్భుత విజయాన్ని అందుకున్నారు.
వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచిన స్థానం
జులై 30న జరిగిన బంకీపూర్ ఉపఎన్నికలో కేవలం 34.30 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 41.45 శాతం పోలింగ్ జరగ్గా ఈసారి 7 శాతానికి పైగా తగ్గడం గమనార్హం. ఈ ఉపఎన్నికలో మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
బిహార్ లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా ఐదోసారి గెలిచారు బీజేపీ నేత నితిన్ నబిన్... ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తాను ఏకంగా 50,000 పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. ఇలాంటి పలితమే ఉపఎన్నికల్లో వస్తుందన్న ధీమాతో ఉన్న బిజెపి షాక్ తగిలింది. ప్రశాంత్ కిషోర్ ఊహించని దెబ్బ తీశారు.
మారతున్ప బీహార్ రాజకీయ సమీకరణాలు?
గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. మొదట నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయినా ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడంతో సామ్రాట్ చౌదరి సీఎం అయ్యారు. ఈ క్రమంలో బంకిపూర్ ఉపఎన్నికు వచ్చాయి. బిజెపి నీరజ్ కుమార్ ను బరిలోకి దింపగా ఆర్జేడీ మరోసారి రేఖా గుప్తాకే టికెట్ ఇచ్చింది. అయితే అందరి దృష్టి మాత్రం జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పైనే ఉంది. ఈ ఎన్నికతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో బంకీపూర్ పోరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చివరకు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు.. దీంతో బిహార్ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


