పెళ్లి మండపంలోనే ప్రియుడికి షాకిచ్చిన లవర్, అసలు ట్విస్ట్ ఇదే...
పెళ్లికోసం వచ్చిన ప్రియుడికి ట్విస్టిచ్చిన లవర్
అమృత్సర్: కొంతకాలంగా ప్రేమించుకొన్నారు. పెళ్లి కూడ చేసుకోవాలనుకొన్నారు. వరుడి కుటుంబసభ్యులు ఈ పెళ్లికి అంగీకరించారు. అయితే వధువు తరుపున కూడ ఈ పెళ్లికి ఒకే చెప్పారు. వరుడు తమ బంధువులతో పెళ్లి జరగాల్సిన హోటల్ వద్దకు వచ్చేసరికి వధువు తరుపు వారు ఒక్కరూ కూడ లేరు. హోటల్లో ఎలాంటి పెళ్లి లేదని హోటల్ యజమాని తేల్చి చెప్పారు. అయితే ఈ విషయమై వధువుతో పాటు వారి బంధువులకు ఫోన్ చేసినా స్పందన లేకుండాపోయింది.దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్కు చెందిన ఓ ఆసుపత్రిలో పారా మెడిక్ గా పనిచేస్తున్న వర్గత్సింగ్ సిమ్రాన్జిత్తో ప్రేమలో పడ్డాడు. కొన్ని నెలల పరిచయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి కూడ చేసుకోవాలని భావించారు. అయితే వీరిద్దరూ ఎప్పుడూ కూడ ముఖాముఖి కలుసుకోలేదు. ఫోన్ సంభాషణ ద్వారానే వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని భావించారు.
తమ ప్రేమ విషయాన్ని వర్గత్సింగ్ తమ ఇంట్లో చెప్పాడు. దీనికి వారు అంగీకరించారు. అయితే దీంతో తన ప్రియురాలితో పెళ్లి విషయమై చర్చించాడు. ఆమె కూడ సరేనంది. అయితే పెళ్లి విషయమై చర్చించేందుకు బల్జీత్ కౌర్ అనే మహిళను ఫోన్లో పరిచయం చేసింది. పెళ్లి వ్యవహరాలన్నీ ఆమె చూసుకొంటుందని కూడ చెప్పింది. దీంతో పెళ్లి విషయమై వర్గత్ సింగ్ బల్జీత్ కౌర్తో చర్చించేవాడు.
పెళ్లి తేదీని కూడ నిర్ణయించుకొన్నారు. ఈ వేడుక కోసం పెళ్లి కూతురు వైపు వారు తాజ్ ప్యాలెస్ బాంకెట్ హాల్ను బుక్ చేసినట్టు చెప్పారు. పర్గత్ తన కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తంగా కలిపి 150 మందితో బ్యాండ్, బాజా, భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. తాజ్ ప్యాలెస్ హోటల్ యజమాని మాత్రం వర్గత్ సింగ్ ను లోపలికి రాకుండా అడ్డుకొన్నారు.
పెళ్లికూతురు తరపు బంధువులకు, పెళ్లికూతురుకు ఫోన్ చేసినా స్పందన లేకుండాపోయింది.దీంతో వరుడితో సహా బంధువులు నిరాశతో వెనుతిరిగారు. ఈ పెళ్లి కోసం బల్జీత్ కౌర్కు 70వేల రూపాయలు ఇచ్చినట్టు చెప్పాడు. బల్జీత్, సిమ్రాన్జిత్లు కలిసి తనను మోసం చేసినట్టు లబోదిబోమంటున్నాడు.
ఇద్దరు మహిళలు తనను మోసం చేశారని వర్గత్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ పెళ్లి కోసం ఇప్పటికే అతను రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. అమ్మాయిని చూడకుండానే ఫోన్లో మాట్లాడి ప్రేమించిన వర్గత్సింగ్ను ఆ యువతి మోసం చేసిందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.