లోయలోపడిన బస్సు.. 62 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు.. దర్శనం చేసుకుని వస్తుండగా కేరళలో ప్రమాదం (వీడియో)
కేరళలో శబరిమల ఆలయాన్ని సందర్శించుకుని తిరిగి వస్తుండగా అయ్యప్ప భక్తులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ బస్సు ప్రమాదంలో 62 మంది గాయపడ్డారు. వీరంతా తమిళనాడుకు చెందిన మయిలాడుతురై జిల్లాకు చెందినవారు.
తిరువనంతపురం: కేరళలో శబరిమల ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరుగుతున్న అయ్యప్ప భక్తులతో బయల్దేరిన బస్సు ఓ లోయలోకి దూసుకుపోయింది. కేరళలో పథానంతిట్టలోని ఎలవుంకల్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 62 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇలా ఉన్నాయి.
శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్న తర్వాత 62 మంది అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. మొత్తం 64 మంది ఉన్న ఆ బస్సు నిలక్కల్ సమీపంలోని ఎలవుంకల్కు రాగానే అక్కడ రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటన మధ్యాహ్నం 1.30 గంటలకు చోటుచేసుకుంది. ఆ 64 మందిలో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా తమిళనాడుకు చెందిన మయిలాడుతురై జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు.
ఈ బస్సు ప్రమాదంలో 62 మందికి గాయాలు అయ్యాయని వివరించారు. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. వారందరినీ పథానంతిట్ట, ఎరుమ్లీలోని పలు హాస్పిటళ్లు, కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలైన వారిని మంచి ఫెసిలిటీస్కు తరలిస్తామని పోలీసులు పీటీఐకి తెలిపారు.