లక్షల్లో భక్తులు, కోట్లల్లో ఆదాయం... మరో తిరుమలను తలపిస్తున్న అయోధ్య
ఇటీవలే ప్రారంభమైన అయోధ్య రామమందిరం మరో తిరుమలను తలపిస్తోంది. భక్దుల దర్శనం, ఆదాయం విషయంలో రామమందిరం తిరుమలతో ఫోటీ పడుతోంది.
![Ayodhya Ram Mandir Recives highest donations in single day AKP Ayodhya Ram Mandir Recives highest donations in single day AKP](https://static-ai.asianetnews.com/images/01hmtax5gm3ct0xvfztar9ybcb/ram-mandir-ayodhya-03-1705985873428_363x203xt.jpg)
అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు... దీంతో దేశ నలుమూలల నుండి రామభక్తులు అయోధ్య బాట పట్టారు. ఇలా అయోధ్యకు చేరుకుంటున్న భక్తులు కేవలం రామయ్య దర్శించుకోవడమే కాదు భారీగా విరాళాలు అందిస్తున్నారు. దీంతో తొలిరోజే రికార్డు స్థాయిలో దర్శనాలే కాదు అదేస్థాయిలో విరాళాలు వచ్చినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.
అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసారు. అలాగే ఆలయానికి రాలేకపోయినా ఆన్ లైన్ లో విరాళాలు అందించే ఏర్పాట్లు కూడా చేసారు. ఇలా ఆలయ కౌంటర్ల, ఆన్ లైన్ ద్వారా మొదటిరోజే రూ.3.17 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.
ఇక తొలిరోజు రికార్డు స్థాయిలో భక్తులు బాలరాముడిని భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలక్ రామ్ ను దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఇక రెండోరోజు(బుధవారం) 2.5 లక్షల మంది రామయ్యను దర్శించుకున్నట్లు తెలిపారు.
Also Read అయోధ్య రామ మందిరానికి మార్చి వరకు వెళ్లొద్దు: కేంద్రమంత్రులకు ప్రధాని విజ్ఞప్తి
భక్తులతాకిడి ఎక్కువగా వుండటంతో ఆలయ వేళల్లో మార్పులు చేసారు. ముందుగా ఉదయం 7 గంటల నుండి 11.30 వరకు.... తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు దర్శన వేళలుగా నిర్ణయించారు. కానీ భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 6 గంటలకే ఆలయాన్ని తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నారు.
ఉదయం నుండే అయోధ్య రామమందిరం వద్ద భక్తుల సందడి మొదలవుతోంది. తీవ్ర చలిని కూడా లెక్కచేయకుండా ఆ రామయ్య దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ భక్తల సంఖ్య ఎక్కువ అవుతూ క్యూలైన పొడవు పెరుగుతోంది. రాత్రి ఆలయం మూసివేసేవరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగుతోంది.
ఇలా భక్తుల తాకిడి, అందుతున్న విరాళాలను చూస్తుంటే అయోధ్య మరో తిరుమలను తలపిస్తోంది. లక్షల్లో భక్తులు, కోట్లల్లో ఆదాయంతో అయోధ్య ఆలయం కూడా తిరుమలలా మారింది. తిరుమలలో మాదిరిగానే అయోధ్యలో ఆద్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.