జయలలిత చివరి ఆడియో విడుదల: ఏమన్నారు?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చివరి వాయిస్ రికార్డుకు సంబంధించిన ఆడియోను అరుముగ స్వామి కమిషన్ విడుదల చేసింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చివరి వాయిస్ రికార్డుకు సంబంధించిన ఆడియోను అరుముగ స్వామి కమిషన్ విడుదల చేసింది. అది 52 సెకన్లు ఉంది. ఈ కమిషన్ జయ మృతికి గల కారణాలపై విచారణ జరుపుతోంది.
ఆ ఆడియో రికార్డును మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత ఫిజీషియన్, శశికళ బంధువు డాక్టర్ శివకుమార్ కమిషన్కు సమర్పించారు. ఆ ఆడియోలో జయలలిత వైద్యుడితో సంభాషించిన విషయం ఉంది.
మీ బీపీ స్థాయి 140/80 ఉంది. మీకు రక్తంపోటు చాలా ఎక్కువగా ఉందని డాక్టర్ జయతో చెప్పారు, "ఏం కాదు ఇది నాకు సాధారణమే అని సమాధానం ఇచ్చారు" అని జయలలిత అన్నట్లు రికార్డయింది.
మరో ఆడియోలో ఆమె విపరీతంగా దగ్గుతూ వైద్యుడికి సమాధానం చెప్పలేక అవస్థ పడుతున్నట్లు ఉంది. ఆమె మరణించిన ఏడాదిన్నర అనంతరం విడుదలైన ఈ ఆడియోలను బట్టి ఆమె వైద్యం తీసుకొనే సమయంలో స్పృహలోనే ఉన్నట్లు అర్థమవుతోంది.
జయలలిత ఆసుప్రతిలో చేరక ముందు ఆమె స్వదస్తూరితో రాసుకొని, పాటిస్తున్న డైట్ ప్లాన్ను కూడా కమిషన్ విడుదల చేసింది.