ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకుల ఇక్కట్లు.. మూడున్నర గంటల ముందే రావాలంటున్న ఇండిగో..!
గత కొన్నిరోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్రమైనరద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తమ ప్రయాణికులను నిర్దేశిత సమయానికి 3.5 (మూడున్నర) గంట ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ ఎయిర్పోర్ట్)లో గత కొన్నిరోజులుగా తీవ్రమైనరద్దీ కారణంగా ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు అన్ని చెకింగ్ లు పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు చాలా సమయం పడుతోంది. ఇక వీకెండ్స్ ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. దీంతో ప్రయాణీకులు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ తన ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసింది. దేశీయ విమాన ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విమాన సమయానికి మూడున్నర గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి ఇండిగో ఓ అడ్వైజరీ జారీ చేసింది.
బ్యాగ్ బరువు 7 కిలోలకు మించకూడదు..
ఇండిగో సలహా ప్రకారం.. ప్రయాణీకులు తమతో ఒక బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లగలరు. దాని బరువు 7 కిలోలకు మించకూడదు.ఇది భద్రతా సిబ్బందికి తనిఖీ చేయడం సులభతరం చేస్తుంది. దీనితో పాటు.. ప్రయాణీకుల వెబ్ చెక్-ఇన్ ఇప్పటికే జరిగిందని నిర్ధారించుకోవడానికి సలహాదారులో విజ్ఞప్తి కూడా చేయబడింది. ఇది కాకుండా.. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-3లో ప్రవేశానికి గేట్ నంబర్ 5 మరియు 6లను ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించబడింది. ఈ గేట్లు ఇండిగో చెక్-ఇన్ కౌంటర్లకు దగ్గరగా ఉన్నందున ఇది చెప్పబడింది. రెండు ప్రవేశ గేట్లను పెంచండి, ఇప్పటికీ సమస్య కొనసాగుతోంది
ఇండిగో విజ్ఞప్తి
"ఢిల్లీ విమానాశ్రయంలోని పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వస్తున్నారు. చెక్-ఇన్, బోర్డింగ్ లకు సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఈ రద్దీ నుంచి ఉపశమనం పొందడానికి ప్రయాణీకులు తన బయలుదేరే సమయానికి కనీసం 3.5 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని కోరుతున్నాం. ఒక హ్యాండ్ బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లాలి. అది కూడా 7 కిలోలు మించరాదు. టెర్మినల్ 3లో ప్రవేశానికి గేట్ నంబర్లు 5, 6లను ఉపయోగించండి, ఎందుకంటే ఇవి ఇండిగో చెక్-ఇన్ కౌంటర్లకు సమీపంలో ఉన్నాయి" అని ఇండిగో తన ట్విట్టర్ హ్యాండిల్ లో తెలిపింది.
గత కొన్ని రోజులుగా.. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రతా తనిఖీ సమయంలో పొడవైన క్యూ ఫోటోలు పంచుకుంటూ ప్రయాణీకులు తమ కష్టాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో విమానాలు నిర్థిత సమయానికి కంటే.. రెండు, మూడు గంటల పాటు లేట్ గా బయలుదేరాల్సి వచ్చినట్టు ప్రయాణికులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం నాడు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3ని ఆకస్మికంగా సందర్శించారు. విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి గత వారంలో ఏర్పాటు చేసిన చర్యలను పరిశీలించి.. పరిస్థితిని సమీక్షించారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని మెరుగుపరుస్తుందని భావిస్తున్న మార్పులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి జారీ చేసిన ఆదేశాల ప్రకారం..
ప్రతి ప్రవేశ ద్వారం వద్ద నిరీక్షణ సమయాన్ని చూపే డిజిటల్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. టెర్మినల్ చెక్పాయింట్ వద్ద కనీసం ఒక వెయిటింగ్ టైమ్ బోర్డ్ను ఏర్పాటు చేయాలి. రద్దీ సమయాల్లో విమానాశ్రయంలో రద్దీని పర్యవేక్షించేందుకు కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏ ప్రవేశ ద్వారం దగ్గర పెద్ద సంఖ్యలో జనం ఉన్నారో ఇక్కడ నుండి తెలుస్తుంది. క్యూలో ఎంత మంది నిలుచున్నారు, వేచి ఉండే సమయం ఎంత అనే సమాచారం ప్రతి ప్రవేశద్వారం వద్ద ఉన్న డిస్ప్లే బోర్డులో ఇవ్వబడుతుంది. వెయిట్ టైమ్కి సంబంధించిన అప్డేట్లను రియల్ టైమ్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మంత్రి సింధియా సూచించారు.
జాతీయ విమానాశ్రయంలో కొనసాగుతున్న రద్దీని పరిష్కరించడానికి, మార్నింగ్ పీక్ అవర్స్లో విమానాలు తగ్గించబడతాయి. టెర్మినల్ 3 నుండి కొన్ని విమానాలను తరలించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయని జాతీయ మీడియా సంస్థ పీటీఐ నివేదించింది. పీక్ అవర్స్ ఉదయం 5 నుండి 9 గంటల వరకు, మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు గా మార్చింది. కమాండ్ సెంటర్ రియల్ టైమ్ ప్రాతిపదికన గేట్ల వద్ద రద్దీని పర్యవేక్షిస్తుంది. టెర్మినల్ 3 వద్ద రద్దీని తగ్గించేందుకు ఒమెస్టిక్, అదనపు ఏటీఆర్ఎస్ (ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్) మెషీన్లను బ్యాగేజీ చెక్ కోసం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద మంత్రి సందర్శించిన అనంతరం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.