"2014కి ముందు కేవలం ధనవంతులు మాత్రమే విమానాల్లో ప్రయాణించేవారు.. కానీ, ఇప్పుడూ..": ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్
గోవాలోని మోపా గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ మొదటి దశను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు, ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత మనోహర్ పారికర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తుంచుకుంటారని అన్నారు.
గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఆయన ఈ విమానాశ్రయానికి నవంబర్ 2016లో శంకుస్థాపన చేశారు. గోవాలో ఇది రెండవ విమానాశ్రయం కాగా, మొదటిది డబోలిమ్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , సీనియర్ బిజెపి నాయకుడు మనోహర్ పారికర్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. తన ప్రభుత్వ దృక్పథం వల్ల ఎయిర్పోర్టు మౌలిక సదుపాయాలు రెట్టింపు అయ్యాయని, మధ్య తరగతి ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజా సౌకర్యాల కల్పనపై ద్రుష్టి సారించలేవనీ, ఆ ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఓటు బ్యాంకుపై ఫోకస్ చేశాయని విమర్శించారు. మొదటి ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపాదించారనీ, కానీ..ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ విమానాశ్రయం గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు. 2014 తర్వాత.. గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందనీ.. ఆ నాటి నుంచి పనులను వేగవంతమయ్యాయని చెప్పాడు. కొత్త విమానాశ్రయానికి గోవా మాజీ ముఖ్యమంత్రి (దివంగత) మనోహర్ పారికర్, పేరు మీదుగా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు.
గత 8 ఏళ్లలో 72 విమానాశ్రయాలను నిర్మించాం: ప్రధాని మోదీ
అలాగే.. 2014కి ముందు భారత్ లో విమాన ప్రయాణాన్ని విలాసవంతమైన సౌకర్యంగా భావించేవారని, కేవలం ధనికులు మాత్రమే విమానాల్లో ప్రయాణించే అవకాశం ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు విమానయాన రంగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని, దాని సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత (2014 వరకు) దేశంలో కేవలం 70 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని ప్రధాని అన్నారు.
కానీ.. తమ ప్రభుత్వం విమానాశ్రయాల నెట్వర్క్ను విస్తరించడం ప్రారంభించిందని, గత 7-8 ఏళ్లలో 72 విమానాశ్రయాలను రూపొందించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాము ఉడాన్ వంటి పథకం ద్వారా సామాన్యులకు విమానయానాన్ని అందుబాటులో ఉండేలా ప్రవేశపెట్టామని తెలిపారు. 2014 ముందు వరకు భారతదేశంలో ఏటా ఆరు కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణించేవారనీ, ప్రస్తుతం ఆ సంఖ్య 14 కోట్లకు చేరుకుందని, అందులో కోటి మంది ఉడాన్ పథకం కింద ప్రయాణించారని ప్రధాని చెప్పారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్గా భారత్
నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించిందనీ, గత 8 సంవత్సరాలలో పర్యాటకుల కోసం 'ఈజ్ ఆఫ్ ట్రావెల్'ని మెరుగుపరచడానికి భారతదేశం అన్ని ప్రయత్నాలు చేసిందని ప్రధాని తెలిపారు. వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని పెంచామనీ, వీసా ప్రక్రియ మరింత సరళీకృతం చేసామని తెలిపారు. మోపా విమానాశ్రయాన్ని సుమారు రూ. 2,870 కోట్లతో నిర్మించామని తెలిపారు.
ఇందులో కార్గో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయనీ.. మోపా విమానాశ్రయం ద్వారా కార్యకలాపాలు 35 దేశీయ మరియు 18 అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరుకోవచ్చనని తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టలో మార్పు వచ్చిందని, ప్రజలు దేశం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు.ప్రతి సంవత్సరం 40 లక్షల మంది ప్రయాణికులు మోపా విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారని, ఇది 3.5 కోట్ల మంది ప్రయాణికులకు పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.
ఈ విమానాశ్రయానికి నవంబర్ 2016లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మోపా విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పనాజీలోని మిరామార్లో పారికర్కు నివాళులర్పించారు.2019 మార్చిలో పారికర్ అంత్యక్రియలు జరిగిన మిరామార్ బీచ్ని సావంత్ సందర్శించారు.
"భాయ్, మేము నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. మోపా విమానాశ్రయం రూపంలో మీ కల మరొకటి పూర్తయింది. మీ ఆశీర్వాదాలు గోవా సంక్షేమం చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీకు హృదయపూర్వక నివాళులు" అని ప్రమోద్ సావంత్ ట్వీట్ చేశాడు.