జల్లికట్టులో 60 మందికి గాయాలు.. రాజాజీ ఆస్పత్రిలో చికిత్స
Madurai: తమిళనాడులోని మధురైలో జల్లికట్టు కార్యక్రమంలో దాదాపు 60 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి పంపగా, 11 మంది ఇంకా అక్కడ చికిత్స పొందుతున్నారని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Tamil Nadu Jallikattu: పొంగల్ సందర్భంగా తమిళనాడులో సాంప్రదాయక జల్లికట్టు కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటగా రాష్ట్రంలోని మధురైలోని అవనియాపురంలో జల్లికట్టు కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాదాపు పోటీలో 800 మందికి పైగా వ్యక్తులు పాలుపంచుకున్నారు. ఎద్దులను పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాల్లోకెళ్తే.. మధురైలోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో సుమారు 60 మంది గాయపడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. పొంగల్ సందర్భంగా ఆదివారం నిర్వహించిన జల్లుకట్లు కార్యక్రమంలో ఎద్దులను పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిలో 60 మంది గాయపడ్డారని తెలిపారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. వారిని రాజాజీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. స్వల్ప గాయాలపాలైన మరో 40 మందికి ప్రథమ చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మధురై జిల్లా కలెక్టర్ అనీష్ శేఖర్ తెలిపారు.
జల్లుకట్టు కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రేక్షకులతో పాటు పార్టిసిపెంట్స్ భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గాయపడిన 20 మందిని మధురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించగా, వారిలో 11 మంది ఇంకా అక్కడే చికిత్స పొందుతున్నారని రెవెన్యూ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కార్యక్రమం మొదలైనప్పిటి నుంచి అందులో పాలుపంచుకున్న వారు గాయపడుతున్నప్పటికీ.. జల్లికట్టు కార్యక్రమం ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో జరగబోయే జల్లికట్టు కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. 'ఎలాంటి గాయాలు కావని ఆశిస్తున్నాం. గాయాలు అయితే, వారికి ఉత్తమ వైద్య సంరక్షణ అందించేలా చూడాలనుకుంటున్నాము. అందుకని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జల్లికట్టు సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నాం' అని మధురై కలెక్టర్ పేర్కొన్నారు.
తమిళనాడులోని మధురైలోని మూడు గ్రామాల్లో 'ఏరు తజువుతల్', 'మంకువిరట్టు'గా పిలిచే జల్లికట్టు ఆదివారం జోరుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పొంగల్ వేడుకలకు అనుగుణంగా.. చాలా కాలం నంచి తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇది స్థానిక ఎద్దుల పందెం క్రీడ, ఇక్కడ పాల్గొనేవారు ఎద్దును కొమ్ములు పట్టుకొని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే ఎద్దులను పట్టుకుని మచ్చిక చేసుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. డజన్ల సంఖ్యలో ఎద్దులు ఉంటాయి. వాటిని పట్టుకోవడానికి యువకులు, ఉత్సాహవంతులు పాల్గొంటారు. సోమ, మంగళవారాల్లో పాలమేడు, అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు జరగనున్నాయి. జల్లికట్టు పోటీలకు 300 మంది ఎద్దులు, 150 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తారు. ఈ గణాంకాలు వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుంది.