అస్సాం సీఎం పీఠం ఎక్కేదెవరు? ఇంకా తేలని అనిశ్చితి !!
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ భాజపా వరుసగా రెండోసారి విజయం సాధించిన విజయం తెలిసిందే.
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ భాజపా వరుసగా రెండోసారి విజయం సాధించిన విజయం తెలిసిందే.
అయితే సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారనేది కాషాయ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి పీఠంమీద నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు మాజీ సీఎం శర్వానంద సోనోవాల్, మరో ప్రముఖ నేత హిమంత విశ్వశర్మలకు భాజపా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీరిద్దరూ శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు పై చర్చలు జరిపేందుకు సోనోవాల్, శర్మ ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నట్లు అస్సాం భాజపా అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా ప్రధాన కార్యదర్శి సంతోష్ లతో వీరిద్దరూ భేటీ అయ్యారు.
ఈ భేటీ అనంతరం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే.
దీంతో శర్వానంద సోనోవాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల ఆయనపై రాష్ట్ర ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బాజాపా గెలుపులో హిమంత విశ్వ శర్మ కీలకపాత్ర పోషించారు. బోడోలాండ్ లో యుపిపిఎల్ పార్టీతో పొత్తు కుదిరింది హిమంతనే. దీంతో ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.
126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో భాజపా 60 చోట్ల జయకేతనం ఎగురవేసింది. మిత్రపక్షాలైన అస్సాం గణపరిషత్ 9, యూపిపిఎల్ 6 స్థానాల్లో గెలిచాయి. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది.