రాజస్తాన్లో గెహ్లాట్, పైలట్లకు దోస్తీ కుదిరిందా? వేదిక పంచుకుని ‘జోడో’ గురించి వ్యాఖ్యలు
రాజస్తాన్లో నిన్నా మొన్నటి వరకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే అంటుకుంటుందనేంతగా కామెంట్లు చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా భారత్ జోడో యాత్ర మరో వారం రోజుల్లో రాజస్తాన్లోకి ప్రవేశిస్తుందనగానే వీరిద్దరూ వేదిక పంచుకుని మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్రను ఉత్సాహం, ఉత్తేజంతో ఆహ్వానిస్తామని ముక్తకంఠంతో తెలిపారు.
న్యూఢిల్లీ: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య ఇటీవలే మరో రౌండ్ కామెంట్ల వర్షం కురిసింది. సచిన్ పైలట్ ద్రోహి అని అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా బురదజల్లడం వల్ల లాభమేమీ ఉండదని పైలట్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఈ రోజు అనూహ్యంగా వీరిద్దరూ వేదిక పంచుకుని మీడియాతో మాట్లాడారు. ఇద్దరూ ‘జోడో’ యాత్ర గురించి వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర రాజస్తాన్లోకి డిసెంబర్ 4వ తేదీన ప్రవేశించనుంది. ఈ తరుణంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య సాగుతున్న వాగ్వాదం గురించి ప్రశ్నించగా.. వారి మధ్య వ్యాఖ్యలు తన యాత్రను ప్రభావితం చేయబోదని, ఆ ఇద్దరు నేతలూ పార్టీకి అస్సెట్స్ అని అన్నారు. యాత్ర కోసం పరిస్థితులు చక్కబెట్టడానికి కేసీ వేణుగోపాల్ ముందుగానే రాజస్తాన్కు వెళ్లారు. ఆయన సమక్షంలోనే గెహ్లాట్, పైలట్లు మీడియాతో కలిసి మాట్లాడారు.
రాహుల్ గాంధీ మా ఇద్దరినీ పార్టీకి అస్సెట్స్ అని చెప్పినప్పుడు.. తామిద్దరమూ అస్సెట్సే అని, అందులో సందేహం లేదని అశోక్ గెహ్లాట్ అన్నారు. పార్టి తమకు సుప్రీమ్ అని విరవించారు. పార్టీ ముందుకు వెళ్లాలని, మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని వివరించారు. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, మరెన్నో జటిలమైన సవాళ్లు ఉన్నాయని వివరించారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం అవుతున్నదని తెలిపారు. కాబట్టి, ఆయన లేవనెత్తుతున్న అంశాలు ప్రజలు స్వీకరిస్తున్నారని అర్థం అవుతున్నదని చెప్పారు.
రాజస్తాన్లో రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్రను ఘనంగా స్వాగతి స్తామని సచిన్ పైలట్ అన్నారు. దేశంలోనే ఉత్సాహంతో ఇక్కడ యాత్ర సాగుతుందని వివరించారు. ఇది చరిత్రాత్మక యాత్ర అని, తమ రాష్ట్రంలో 12 రోజులు సాగుతుందని అన్నారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారని జైపూర్లో విలేకరులతో చెప్పారు.
Also Read: అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘మేమంతా ఐక్యంగా ఉన్నం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉన్నదని ఇక్కడ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లు చెప్పారు. అశోక్, సచిన్లు కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు అని రాహుల్ గాంధీ స్పష్టంగా అన్నారు’ అని తెలిపారు.