ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్లోని సికర్ పట్టణంలో జరిగే కార్యక్రమంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవరం, శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్లోని సికర్ పట్టణంలో జరిగే కార్యక్రమంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవరం, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే ప్రధాని పర్యటనలో ముందుగా షెడ్యూల్ చేసిన తన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించారని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అశోక్ గెహ్లాట్ ట్వీట్ ప్రకారం.. పీఎంవో ముందుగా షెడ్యూల్ చేసిన 3 నిమిషాల ప్రసంగాన్ని కార్యక్రమం నుంచి తొలగించింది. అందువల్ల తాను ప్రధాని మోదీని ప్రసంగం ద్వారా స్వాగతించలేను.. కనుక ఈ ట్వీట్ ద్వారా రాజస్థాన్కు మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.
అయితే అశోక్ గెహ్లాట్ వాదనకు విరుద్దంగా ప్రధానమంత్రి కార్యాలయం బదులిచ్చింది. గెహ్లాట్ ట్వీట్పై పీఎంవో స్పందిస్తూ.. ఆయన రాలేరని సీఎం కార్యాలయమే తెలిపిందని పేర్కొంది. ‘‘అశోక్ గెహ్లాట్.. ప్రోటోకాల్కు అనుగుణంగా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీ ప్రసంగం కూడా స్లాట్ చేయబడింది. కానీ, మీరు చేరలేరు అని మీ ఆఫీస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత సందర్శనల సమయంలో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీరు కూడా కార్యక్రమాలకు హాజరయ్యారు. నేటి ప్రోగ్రామ్లో చేరడానికి మీకు అత్యంత స్వాగతం. అభివృద్ధి పనుల శిలాఫలకంపై కూడా మీ పేరు ఉంది. మీ ఇటీవలి గాయం కారణంగా మీకు ఏదైనా శారీరక అసౌకర్యం కలగకపోతే.. మీ హాజరు విలువైనదిగా పరిగణించబడుతుంది.’’అని పీఎంవో ట్వీట్ చేసింది.
ఇక, ఈ ఏడాది చివరిలో రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే గత ఆరు నెలల్లో రాజస్థాన్లో ప్రధాని మోడీ ఇది 7వ పర్యటన. అయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ చేసిన ఆరోపణలు కలకలం రేపగా.. అందుకు పీఎంవో కూడా ధీటుగా బదులిచ్చింది.
