ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. భారతదేశ భూభాగాన్ని చైనా అక్రమిస్తోందని.. అలాంటి చైనా ముందు బీజేపీ సర్కార్ ఎందుకు మోకరిల్లుతోందని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. భారతదేశ భూభాగాన్ని చైనా అక్రమిస్తోందని.. అలాంటి చైనా ముందు బీజేపీ సర్కార్ ఎందుకు మోకరిల్లుతోందని ప్రశ్నించారు. గాల్వాన్లో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు చెప్పాలని మోదీ సర్కార్ను డిమాండ్ చేశారు. ‘‘లద్దాఖ్ సరిహద్దులో వాస్తవ పరిస్థితుల గురించి తన దేశాన్ని అంధకారంలో ఉంచుతూ మన ప్రధాని.. చైనా అధ్యక్షుడితో సమావేశాలు కావాలని అడుగుతున్నారు. మోదీ ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు?’’ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు.
గురువారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లు కొద్దిసేపు సంభాషించుకోవడం కనిపించింది. ఈ సమావేశానికి అభ్యర్థన చైనా నుంచి వచ్చిందని భారత అధికారులు చెప్పినప్పటికీ.. భారత అధికారుల అభ్యర్థన మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో తమ దేశ అధ్యక్షుడు జి జిన్పింగ్ మాట్లాడారని చైనా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి చెప్పారు.
చైనా విదేశాంగ కార్యాలయం ప్రకటనపై ఒవైసీ స్పందిస్తూ.. ‘‘మన వీర సైనికులు 40 నెలలుగా సరిహద్దులో ఉన్నారు. చైనీయులకు భయపడలేదు. మోదీ ఎందుకు జిన్పింగ్కు ఎదురొడ్డి నిలబడలేకపోతున్నారు. మన సైనికులను ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? ఈ భూభాగాన్ని కోల్పోవడం మోడీకి ఆమోదయోగ్యమేనా?. సరిహద్దు సమస్యపై మోడీ ప్రభుత్వం చైనా ముందు లొంగిపోవడం సిగ్గుచేటు. ప్రమాదకరం. ఇది మోడీ వ్యక్తిగత ఆస్తి కాదు, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.
