ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశం: ఏపీ డిమాండ్లపై గళమెత్తనున్న బాబు
నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రం తీరును ఎండగట్టనున్న బాబు
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం ఆదివారం నాడు న్యూఢిల్లిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అద్యక్షతన ప్రారంభమైంది. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అవసరమైతే కేంద్రం తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించాలని బాబు భావిస్తున్నారు. బిజెపియేతర సీఎంలు కూడ ఇదే రకమైన వైఖరిని అవలంభించే అవకాశం లేకపోలేదని సమాచారం.
నీతి ఆయోగ్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. మరో వైపు న్యూఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ ను కలిసేందుకు అనుమతివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా మరో ముగ్గురు సీఎంలు లెఫ్టినెంట్ గవర్నర్ ను అనుమతి కోరారు. కానీ, ఆయన నుండి అనుమతి రాలేద. మరోవైపు కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళి ఆ సతీమణితో చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆరు అంశాలపై చర్చించనున్నారు. దీక్షలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ సమావేశానికి హజరుకాలేదు.
గాంధీ జయంతి 150వ జయంతి వేడుకలపై చర్చించనున్నారు. ఆయుష్మాన్ భారత్, పౌష్టికాహారం, జిల్లాల అభివృద్ది, రైతులకు గిట్టుబాటు ధర అంశాలపై కూడ చర్చించనున్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సీఎం ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. రైతులకు సంక్షేమ పథకాలు, గిట్టుబాటుధర అంశాలపై కెసిఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది.మధ్యాహ్నం మూడున్నర గంటలకు సీఎంలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ ప్రసంగించే అవకాశం ఉంది.