బ్రిటీష్ విద్యావిధానం స్థానంలో భారతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిందే
దేశంలో బ్రిటీష్ వారి నుంచి సంక్రమించిన విద్య స్థానంలో ‘భారతీయ’ లేదా స్వదేశీ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు
దేశంలో బ్రిటీష్ వారి నుంచి సంక్రమించిన విద్య స్థానంలో ‘భారతీయ’ లేదా స్వదేశీ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివరిలో జరిగే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన వడోదర లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో టౌన్హాల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నలందలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు భారతదేశం గమ్యస్థానంగా మారాలని అన్నారు. ఈ సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఎన్సిఇఆర్టి రూపొందించిన పాఠ్య పుస్తకాలను మార్చాలా అని ఒకరు ప్రశ్నించగా.. “ఎన్సిఇఆర్టి పుస్తకాలు మాత్రమే కాకుండా మొత్తం మెటీరియల్ను మార్చాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ విద్యావ్యవస్థకు స్వస్తి పలికి దేశంలో భారతీయ విద్యావ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాత విద్యావిధానాన్ని రద్దు చేయకుండా దేశం తప్పు చేసిందని కేజ్రీవాల్ అన్నారు. మన విద్యావ్యవస్థ మొత్తం బ్రిటీష్ వారి బహుమతి అని ఆయన అన్నారు. ఇది 1830 లలో మెకాలే యొక్క వ్యవస్థ, తద్వారా గుమాస్తాలుగానే తయారు అవుతామని అన్నారు. తాను ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులందరినీ గౌరవిస్తాననీ, కానీ దేశానికి స్వాతంత్య్ర సిద్దించిన తరువాత బ్రిటీష్ విద్యావిధానాన్ని రద్దు చేసి.. కొత్త విద్యావిధానాన్ని సిద్ధం చేసి ఉండాల్సిందని అన్నారు.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. ఉదాహరణకు.. పిల్లలు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం వెతకడం ప్రారంభిస్తారు. కానీ.. ఉద్యోగాల కోసం వెతకని, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే ఇలాంటి విద్యార్థులను సిద్ధం చేసే విద్యా వ్యవస్థ కావాలని అన్నారు. ఢిల్లీలో ఈ విద్యా వ్యవస్థను ప్రారంభించామనీ, 11, 12 తరగతుల విద్యార్థులకు వ్యాపారం ఎలా చేయాలో నేర్పడం ప్రారంభించామని తెలిపారు.
ఢిల్లీ పాఠశాలల్లో విద్యార్థులకు దేశభక్తి, ఉన్నత వ్యక్తిగా ఎలా రూపాంతరం చెందాలో మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా నేర్పిస్తున్నారని అన్నారు. భారతదేశానికి 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చింది. అత్యుత్తమ ఇంజనీర్, డాక్టర్ అయినప్పటికీ.. మన దేశం వెనుకబడిపోయిందనీ, నేడు భారతీయ పిల్లలు వైద్య చదువుల కోసం ఉక్రెయిన్ లాంటి చిన్న చిన్న దేశాలకు వెళ్లడం సిగ్గుచేటని కేజ్రీవాల్ అన్నారు.
ప్రాచీన భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారనీ, నేడు మన విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని అన్నారు.
ఆప్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించినందున ఢిల్లీలో నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారారని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు 1,100 మంది విద్యార్థులు నీట్, ఐఐటీ-జేఈఈలో ఉన్నత వైద్య, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.
పేదరికాన్ని పారద్రోలే సాధనం విద్య అని తాను పూర్తిగా విశ్వసిస్తున్నాననీ, మన పిల్లలకు మంచి చదువులు చెబితే మన దేశం పేదరికం కాదు, అమెరికా కంటే మెరుగవుతుందని తెలిపారు. విద్యపై కమ్యూనికేట్ చేయడానికి గత నాలుగు-ఐదు రోజుల్లో గుజరాత్లో 13 స్థలాలను బుక్ చేయడానికి ఆప్ ప్రయత్నించిందని, అయితే అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు వేదిక యజమానులను బెదిరించారని కేజ్రీవాల్ ఆరోపించారు.