Arvind Kejriwal: ఢిల్లీలో 12,430 స్మార్ట్ క్లాస్రూమ్లను ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు భారత్ మరింతగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొన్నారు.
Arvind Kejriwal: ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్ (smart classrooms) లను ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. భారత్ ఇప్పుడు ముందుకు సాగుతున్నదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొన్నారు. ఈరోజు మొత్తం 12,430 కొత్త స్మార్ట్ క్లాస్రూమ్లు ప్రారంభించబడ్డాయి. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్మించిన కొత్త తరగతి గదుల సంఖ్య 20,000కి చేరుకుంటుంది. ఇది 537 కొత్త పాఠశాల భవనాలకు కొత్త హంగులు తెచ్చింది. ప్రభుత్వం నిర్మించిన కొత్త భవనం ప్రత్యేకతలలో తరగతి గదుల్లో డిజైనర్ డెస్క్, లైబ్రరీలు, ఈవెంట్ల నిర్వహణ కోసం మల్టీపర్పస్ హాల్స్ ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బలమైన పోటీదారుగా నిలిచిన పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు ప్రారంభోత్సవం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్ల ప్రారంభోత్సవ వేడుకకు కొన్ని గంటల ముందు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఒక ట్వీట్లో “ఆప్ని లక్ష్యంగా చేసుకున్న అవినీతిపరులకు” ఈ రోజు తగిన సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. "దేశంలోని అవినీతిపరులందరూ మాకు వ్యతిరేకంగా గుమిగూడారు. నేడు, ఢిల్లీ పాఠశాలల్లో 12,430 ఆధునిక తరగతి గదులను ప్రారంభించడం ద్వారా, మేము వారికి తగిన సమాధానం ఇస్తాము" అని కేజ్రీవాల్ చేసిన ట్వీట్ పేర్కొంది. ‘అవినీతిపరులకు’ తలవంచకూడదని దేశం ముందుకు సాగాలని నిర్ణయించుకుందని కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు.
అవినీతిపరులకు ఈ దేశం తలవంచదు.. ఇప్పుడు దేశం నిర్ణయించింది.. ఇప్పుడు దేశం ముందుకు సాగుతుంది.. బాబా సాహెబ్, భగత్ సింగ్ కలలు నెరవేరుతాయని కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కుమార్ విశ్వాస్ తనపై చేసిన ఆరోపణలపై కొనసాగుతున్న వివాదం మధ్య ఆప్ చీఫ్ వ్యాఖ్యలు రావడం గమనార్హం. అలాగే, ఆప్ సర్కారు చేసిన పలు అంశాలను కూడా కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఏడేండ్లలో 7 వేల తరగతి గదులను నూతనంగా నిర్మించిందని తెలిపారు. అయితే, ఈ ఏడేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 20 వేల క్లాస్ రూమ్లను కూడా ఏర్పాటు చేయలేకపోయిందంటూ విమర్శించారు. దేశంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల. దురదృష్టవశాత్తూ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇతర రాష్ట్రాల్లో ఆయన కల నెరవేరలేదు అని పేర్కొన్నారు. తాము ఈ కలలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పష్టం చేశారు.
