9వ తేదీలోపు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలి.. లేదంటే: కేంద్రానికి రైతు నేతల వార్నింగ్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లకు రైతు నేతలు మద్దతు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీలోపు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని, లేదంటే తాము రెజ్లర్లతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగుతామని రైతు నేత రాకేశ్ టికాయత్ తెలిపారు.
న్యూఢిల్లీ: రెజ్లింగ్ బాడీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న టాప్ రెజ్లర్లకు మద్దతు పలుకుతున్న రైతు నేతలు మరో అడుగు ముందుకేశారు. కేంద్ర ప్రభుత్వానికి కొత్తగా ఓ అల్టిమేటం ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ లోపు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని, లేదంటే రెజ్లర్లతో కలిసి తాము కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
రెజ్లర్ల సమస్యలను పట్టించుకోవాలని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని రైతు నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. లేదంటే.. జూన్ 9వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాము కూడా రెజ్లర్లతోపాటే ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పంచాయత్లు నిర్వహిస్తామని తెలిపారు.
రెజ్లర్లపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని టికాయత్ అన్నారు.
రైతు సంఘాలు ఉత్తరప్రదేశ్లో ఖాప్ మహా పంచాయత్ నిర్వహించాయి. పంజాబ్, హర్యానాల్లోనూ రెజ్లర్లకు సంఘీభావంగా నిరసనలు చేశాయి.
Also Read: సెక్స్లో పాల్గొనలేదని గర్ల్ఫ్రెండ్ను చితకబాదిన యువకుడు, హత్యాయత్నం కింద అరెస్టు
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేశారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవిని క్రీడాకారులను వేధించడానికి దుర్వినియోగం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక మైనర్ బాలిక సహా ఇంకొందరు మహిళా రెజ్లర్లపై సెక్సువల్ హరాస్మెంట్ చేసినట్టు రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో రెండు కేసులు నమోదయ్యాయి.
అందులో ఒకటి మైనర్ బాలికపై లైంగిక ఆరోపణలకు సంబంధించింది. ఈ కేసు పోక్సో యాక్ట్ కింద ఫైల్ కావడం గమనార్హం.