ట్రాక్ మార్చిన కేటుగాళ్లు.. నకిలీ నోట్లు కాదు, నకిలీ కాయిన్స్ తయారీ.. 9 లక్షల ఫేక్ కాయిన్స్ సీజ్
ఫేక్ కరెన్సీ ముఠా ట్రాక్ మార్చినట్టు తెలుస్తున్నది. పెద్ద నోట్లకు నకిలీ తయారు చేయడం కాదు.. ఫేక్ కాయిన్స్ తయారు చేయడంపై ఫోకస్ పెట్టారనే చర్చ మొదలైంది. ఎందుకంటే ముంబయిలో 9.46 లక్షల నకిలీ కాయిన్స్ను పోలీసులు సీజ్ చేశారు. హర్యానాలో ఫేక్ కాయిన్స్ తయారుచేసే ఫ్యాక్టరీనే నడుపుతున్నారు.
న్యూఢిల్లీ: కేటుగాళ్లు తమ రూటు మార్చుకున్నారు. నకిలీ కరెన్సీగా గతంలో పెద్ద నోట్లనే ముద్రించేవారు. పెద్ద నోట్లను ముద్రించడంతో తక్కువ పెట్టుబడి, శ్రమతో ఎక్కువ మొత్తంలో ఆ మాయగాళ్లు మోసం చేసేవారు. కానీ, ప్రజల్లోనూ ఫేక్ నోట్లపై అవగాహన రావడంతో పెద్ద నోట్లు తీసుకునేటప్పుడు అందరూ వాటిని పరీక్షించి తీసుకుంటున్నారు. దీంతో కేటుగాళ్లు చిల్లరపైకి ఫోకస్ మార్చినట్టు తెలుస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది లక్షల కోట్ల నకిలీ కాయిన్స్ను పోలీసు అధికారులు సీజ్ చేశారు.
ఢిల్లీ పోలీసులు, ముంబయి పోలీసులు సంయుక్తంగా ఈ మొత్తాన్ని ముంబయిలో సీజ్ చేశారు. ‘ఢిల్లీ పోలీసు స్పెషల్ టీమ్ బుధవారం రాత్రి ముంబయికి వచ్చింది. ఫేక్ కాయిన్ బిజినెస్ గురించి మాకు తెలియజేశారు. మేం వెంటనే మలడ్లోని వల్లభ్ బిల్డింగ్ ఏ- వింగ్ సొసైటీలో జాయింట్ ఆపరేషన్ చేశాం. పెద్ద మొత్తంలో కాయిన్స్ సీజ్ చేశాం’ అని దిందోషి పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి జీవన్ కరత్ తెలిపారు.
బుధవారం అర్ధరాత్రి జిగ్నేశ్ గాలా అనే 42 ఏళ్ల నిందితుడిని దిందోషి పోలీసు స్టేషన్ పరిధిలో పుష్పక్ పార్క్ ఏరియాలో పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్టు వివరించారు.
‘సుమారు 9 లక్షల 46 వేల నకిలీ కాయిన్స్ సీజ్ చేశాం. ఇందులో ఒక రూపాయి, ఐదు రూపాయాలు, పది రూపాయల కాపర్, బ్రాస్ కాయిన్స్ ఉన్నాయి. వీటిని నిందితుడి కారు నుంచి పట్టుకున్నాం’ అని జీవన్ కరత్ వివరించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నకిలీ కాయిన్ తయారీ ఫ్యాక్టరీ హర్యానాలో నడుపుతున్నారు. దాన్ని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రైడ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారు ఈ నకిలీ కాయిన్లను ముంబయిలో మతపరమైన ప్రాంతాల్లో అసలైన డబ్బుకు ఎక్స్చేంజ్ కింద బదిలీ చేసుకునేవారు. నిందితులు ఐపీసీలోని 232, 234, 235, 243, 120(బీ) సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది.