సిగ్గనిపించడం లేదా?.. అత్యాచార నిందితులకు బీజేపీ మద్దతుపై ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు
Rahul Gandhi: బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన 11 మందిని ఇటీవల గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే దోషుల విడుదలను అక్కడి బీజేపీ సర్కారు సమర్థించుకోవడం గమనార్హం.
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు మరోసారి దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన 11 మందిని ఇటీవల గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే దోషుల విడుదలను అక్కడి బీజేపీ సర్కారు సమర్థించుకోవడం గమనార్హం. బీజేపీకి మద్దతు తెలిపే కొన్ని సంస్థలు దోషులకు స్వీట్లు పంచుతూ.. పూలమాలలు వేయడం సర్వత్ర ఆగ్రహాన్ని పెంచుతోంది.
ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు గుజరాత్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లకు బీజేపీ మద్దతివ్వడం మహిళల పట్ల ఆ పార్టీ ఆలోచనా ధోరణిని ఎలా ఉందనేది తెలియజేస్తోందని అన్నారు. ఇలాంటి రాజకీయాలకు మీకు సిగ్గు అనిపించడం లేదా? అంటూ ప్రధాని మోడీని ప్రశ్నించారు. 2002 బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన వారిని ఈ వారం గుజరాత్ లోని బీజేపీ సర్కారు విడుదల చేసింది. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్, హత్రాస్, జమ్మూకశ్మీర్ లోని కథువా, ఇప్పుడు గుజరాత్ లలో జరిగిన అత్యాచార కేసుల విషయంలో బీజేపీ తీరు, మహిళపట్ల ఆ పార్టీ పనులకు ఉదాహరణలుగా ఉన్నాయని పేర్కొన్నారు.
"ఉన్నావ్ - బీజేపీ ఎమ్మెల్యేను కాపాడేందుకు పనిచేశారు.
కథువా - రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు.
హత్రాస్ - రేపిస్టులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం.
గుజరాత్ - రేపిస్టులు, హత్య దోషుల విడుదల.. వారిని గౌరవించడం.
నేరస్థుల మద్దతివ్వడం పట్ల మహిళల పట్ల బీజేపీ చిల్లర మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి రాజకీయాలకు మీరు సిగ్గుపడటం లేదా?" అంటూ ప్రశ్నించారు.
ఇదే విషయంపై మరో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం కూడా బీజేపీ విమర్శలు గుప్పించారు. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదల, వారిని పూలమాలలతో స్వాగతం పలకడం గురించి స్పందిస్తూ.. రిమిషన్ మంజూరు చేసిన రివ్యూ ప్యానెల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నాని పేర్కొన్నారు. “గుజరాత్లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులకు క్షమాపణలు మంజూరు చేయడంలో ఆసక్తికరమైన సైడ్ స్టోరీ ఉంది. రివ్యూ ప్యానెల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సికె రాల్జీ, సుమన్ చౌహాన్ ఉన్నారు! "మరొక సభ్యుడు మురళీ ముల్చందానీ గోద్రా రైలు దహనం కేసులో ప్రాసిక్యూషన్కు కీలక సాక్షిగా ఉన్నారు!" అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.