ప్రణబ్ ఎఫెక్ట్: ఆర్ఎస్ఎస్లో చేరేందుకు మూడొంతులు పెరిగిన ధరఖాస్తులు
ప్రణబ్ కారణంగా ఆర్ఎస్ఎస్కు మంచి రోజులు
నాగ్పూర్:ఆర్ఎస్ఎస్లో చేరేందుకు ధరఖాస్తులు భారీగా పెరిగాయి. ఇటీవల ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రణబ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతే అందులో చేరేందుకు ధరఖాస్తుల సంఖ్య మూడింతలు పెరిగిందని ఆ సంస్థ ప్రకటించింది.
ఆర్ఎస్ఎస్లో చేరేందుకు అత్యధికంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుండి ధరఖాస్తులు వచ్చినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఈ నెల 7వ తేదీన నాగ్పూర్ లో జరిగిన ఓ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.
ఈ నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆర్ఎస్ఎస్ సభ్యత్వాల కోసం రోజుకు 378 ధరఖాస్తులు వచ్చేవి.. అయితే ఈ నెల 7వ తేదీ నుండి రోజుకు 1,779 ధరఖాస్తులు వస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ ప్రకటించింది.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొనడాన్ని కూతురుతో సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకించారు. ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం తర్వాత ఆర్ఎస్ఎస్ లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని వ్యతిరేకించిన వారికి ఆర్ఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి వైద్య ధన్యవాదాలు తెలిపారు.