ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వానికి మరో షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన రాజ్ ఠాక్రే..
రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎంవీఏ ప్రభుత్వం బల నిరూపణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి గౌహతిలో రిసార్ట్స్ లో ఉంటున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబాయికి రానున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ మద్దతు షిండే వర్గానికే ఉంటుందని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ప్రకటించారు.
రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న సంకీర్ణ ఎంవీఏ ప్రభుత్వానికి మద్దతు కరువవుతోంది. ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతోన్న శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు తన సమీప బంధువు అయిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే కూడా మద్దతు అందించలేదు. లౌడ్ స్పీకర్ల వివాదంలో మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన ఆయన.. తాజాగా తన మద్దతు ఏక్ నాథ్ షిండే వర్గానికి, బీజేపీకే ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల :ఆగష్టు 6న పోలింగ్
రాజ్ ఠాక్రే కొంత కాలం నుంచి సంకీర్ణ ఎంవీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మతపరమైన స్థలాల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఏప్రిల్ నెల నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. మే 3వ తేదీ వరకు ప్రార్థనా స్థలాల్లో ముఖ్యంగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని చెప్పారు. లేకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా ప్లే చేస్తానని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఒక్క సారిగా ఈ లౌడ్ స్పీకర్ల వివాదంపై దేశం మొత్తం చర్చ సాగింది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో మత పరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను తొలగించారు.
మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం సంక్షోభంలో పడిన దగ్గర నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. ఎక్కడా కూడా పొలిటికల్ కామెంట్స్ చేయలేదు. అయితే ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ వస్తున్న ఆయన.. తాజాగా తన స్టాండ్ ను ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో తన మద్దతు పూర్తిగా బీజేపీకి, ఏక్ నాథ్ షిండే వర్గానికే ఉంటుందని వెల్లడించారు. దీంతో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వానికి మరింత షాక్ తగిలినట్టు అయ్యింది.
బల పరీక్షలో పాల్గొనేందుకు అనుమతివ్వండి.. సుప్రీంకోర్టును కోరిన నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్
దాదాపు షిండే వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతుతో పాటు ఇప్పుడు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన్ (ఎంఎన్ఎస్) ఎమ్మెల్యేల బలం కూడా షిండే వర్గానికి కలిసిరానుంది. కాగా మంగళవారం రాత్రి రాజ్భవన్లో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర బీజేపీ నేతలు గవర్నర్ భగవంత్ కోష్యారీని కలిశారు. ఎంవీఏ ప్రభుత్వాన్ని బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీన బలనిరూపణ కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని గవర్నర్ నిర్ణయించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ బల నిరూపణ కార్యక్రమం మొదలు కానుంది.
ఇదిలావుండగా తన సొంత పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, అలాగే స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ మాతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు మాకు ఉన్నారు. మేము ఫ్లోర్ టెస్ట్ విషయంలో ఆందోళన చెందటం లేదు. మేము ఈ పరీక్షలో విజయం సాధిస్తాం ’’ అని అస్సాంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తర్వాత షిండే మీడియాతో అన్నారు. మరి మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘ ఎవరూ రాజ్యాంగాన్ని, దేశాన్ని అతీతంగా ప్రవర్తించాల్సిన అసవరం లేదు. ఇది మహారాష్ట్ర అభివృద్ధి, హిందుత్వ పురోగతి కోసం. మెజారిటీ మాతోనే ఉంది. రేపు ఫ్లోర్ టెస్ట్ తర్వాత మేమంతా కూర్చొని మా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తాం ’’ అని ఆయన అన్నారు.