బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వల్ల ఏర్పడిన వేడి ఇంకా చల్లారకముందే అదే పార్టీకి చెందిన మరో నాయకుడు కూడా అలాంటి పనే చేశారు. సోషల్ మీడియాలో మహమ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర పోస్ట్ చేశారు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ముస్లింల ఆరాధ్యుడైన మహమ్మద్ ప్రవక్తపై మరో బీజేపీ నాయకుడు అభ్యంతరకర పోస్టు పెట్టాడు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ టీవీ డిబేట్ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల వల్లే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీలో మత ఘర్షణ జరిగి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం అరెస్టు అయిన నాయకుడు హర్షిత్ శ్రీవాస్తవ.. యూపీలోని కాన్పూర్ లో బీజేపీ యువమోర్చా మాజీ జిల్లా కార్యదర్శి గా ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకమైన పోస్టు చేశారు. దీంతో ఆయనను మంగళవారం కాన్పూర్ లో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్ ను పోస్ట్ చేసినందుకు శ్రీవాస్తవపై కేసు నమోదు చేసినట్టు శాంతి భద్రతల ఏడీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఇద్దరు మాజీ మంత్రులపై అవినీతి కేసు.. చెట్లు కూల్చడానికి ఒకరు.. రక్షించడానికి ఇంకొకరు లంచాలు
జ్ఞాన్ వ్యాపి మసీదు అంశంపై టీవీ చర్చ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాన్పూర్ లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రెండు వర్గాల సభ్యులు ఘర్షణకు దిగారు. ఆమె మహమ్మద్ ప్రవక్తపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు నిరసనగా దుకాణాలను మూసివేసే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా రెండు వర్గాలు తీవ్రంగా గొడవ పడ్డాయి.
అయితే ముస్లిం మత నాయకుడిపై వ్యాఖ్యలు చేసినందుకు నూపుర్ శర్మను బీజేపీ ఆదివారం సస్పెండ్ చేసింది. అలాగే ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్ నవీన్ జిందాల్ ను బహిష్కరించింది. తాము అన్ని మతాలను గౌరవిస్తున్నామని, ఏ మతానికి చెందిన వ్యక్తినైనా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఖతార్, ఇరాన్, కువైట్, యూఏఈ, మలేషియా సహా పలు ముస్లిం దేశాల నుంచి ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ప్రపంచ దేశాల ఖండనను పరిగణనలోకి తీసుకున్న భారత్.. కొందరు వ్యక్తుల ట్వీట్లు, వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ఏ విధంగానూ ప్రతిబింబించవని పేర్కొంది. ‘‘ మన నాగరిక వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా, భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది అని కూడా పేర్కొంది.
రాజస్తాన్లో రిసార్ట్ రాజకీయాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మ్యాజిక్ షో.. బీజేపీ ఎమ్మెల్యేలకు యోగా
తాజాగా టీవీ డిబేట్లలో నాయకులు పాటించాల్సిన నియమాలను బీజేపీ రూపొందించింది. ఈ చర్చల సందర్భంగా ఎవరూ ఏ మతాన్ని, ఏ మతానికి చెందిన వ్యక్తినైనా విమర్శించకూడదని తెలిపింది. చర్చ వాడీ వేడిగా జరుగుతున్నప్పుడు కూడా పార్టీ ప్రతినిధులు హద్దులు మీరవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే భాష పట్ల కూడా పార్టీ ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. చర్చలో పడి ఆవేశానికి లోను కావొద్దని, ఆందోళనకు దిగొద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఎవరు రెచ్చగొట్టినా.. వారి ట్రాప్లో పడొద్దని, పార్టీ భావజాలాన్ని, ఆదర్శాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని పార్టీ ప్రతినిధులకు తెలిపినట్టు పేర్కొంది. అలాగే టీవీలో చర్చించే టాపిక్ విషయంలో పార్టీ ప్రతినిధులు ముందస్తుగా తెలుసుకోవాలని, దానిపై చర్చకు సిద్ధం అయిన తరువాతనే పాల్గొనాలని ఆదేశించింది.
