వినియోగదారులకు షాక్.. పాల ధరలు పెంచిన అమూల్, మదర్ డెయిరీ.. రేపటి నుంచే అమల్లోకి
పాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. రేపటి నుంచి అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు పెరగనున్నాయి. లీటర్ పాల ధరను రూ. 2 పెంచుతూ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది.
పాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. రేపటి నుంచి అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు పెరగనున్నాయి. లీటర్ పాల ధరను రూ. 2 పెంచుతూ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. అమూలు తాజా పాలు విక్రయిస్తున్న గుజరాత్, ఢిల్లీ-ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబైలతో పాటుగా అన్ని ఇతర మార్కెట్లలో పెంచిన ధరలు అమల్లోకి రానున్నట్టుగా తెలిపింది. పెంచిన ధరలు రేపటి నుంచి (ఆగస్టు 17) అమలులోకి రానున్నట్టుగా తెలిపింది.
ఆపరేషన్, పాల ఉత్పత్తి మొత్తం ఖర్చు పెరగడం వల్ల ఈ ధరల పెంపు జరుగుతుంది.. గత ఏడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పెరిగిందని ఫెడరేషన్ తెలిపింది. ‘‘ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే.. మా సభ్య సంఘాలు కూడా గత సంవత్సరం కంటే రైతుల ధరలను 8 నుంచి 9 శాతం పరిధిలో పెంచాయి’’ ఫెడరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ధరలు పెరిగిన తర్వాత.. అమూల్ గోల్డ్ 500 ఎంఎల్ ధర రూ. 31, అమూల్ తాజా 500 ఎంఎల్ ధర రూ. 25, అమూల్ శక్తి 500 ఎంఎల్ ధర రూ. 28కి విక్రయించనున్నారు.
ఇదిలా ఉంటే.. మదర్ డెయిరీ కూడా పాల ధరను పెంచింది. బుధవారం నుండి అమలులోకి వచ్చేలా ఢిల్లీ-ఎన్సీఆర్లో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచాలని నిర్ణయించింది. పాల సేకరణ, ఇతర ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచుతున్నట్టుగా తెలిపింది. అయితే ఈ ఏడాదిలో మార్చిలో కూడా మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్సీఆర్లో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో మదర్ డెయిరీ ప్రముఖ పాల సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. పాలీ ప్యాక్లలో, వెండింగ్ మెషీన్ల ద్వారా రోజుకు 30 లక్షల లీటర్ల కంటే ఎక్కువ విక్రయిస్తుంది. కొత్త ధరలు అన్ని పాల రకాలకు వర్తిస్తాయని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. బుధవారం నుంచి ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.61కి చేరుకోనుంది. టోన్డ్ మిల్క్ ధరలు లీటరుకు రూ. 51కి, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుకు రూ. 45కి పెరగనున్నాయి. ఆవు పాల ధర లీటరుకు రూ. 53కి పెరగనుంది. టోన్డ్ మిల్క్ ధరలు లీటరుకు రూ.51కి, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.45కి పెరగనున్నాయి. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ.46 నుంచి రూ.48కి పెంచారు. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్పుట్ ఖర్చులు పెరిగాయని అధికారి తెలిపారు.