పహల్గాం ఉగ్రదాడిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎవరినీ వదలమని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

Amit Shah: పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం దుఃఖంలో, ఆగ్రహంలో ఉంది... ప్రజల నుండి ప్రతిపక్షాల వరకు అందరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. దాడి జరిగి 9 రోజులు గడిచినా ఉగ్రవాదులు పట్టుబడకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమావేశమై సైన్యానికి స్వేచ్ఛనిచ్చారు. గురువారం అమిత్ షా కూడా ప్రతీకారం తీర్చుకుంటామని...ఎవరినీ వదలమని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ఉందని... ఎవరూ తప్పించుకోలేరని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏప్రిల్ 23న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశంలో ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సరిహద్దు దాటి సంబంధాలున్నాయని ప్రకటించారు.

దాడి తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, వీసాల రద్దు వంటి చర్యలు పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చేందుకే.

అమిత్ షా ప్రసంగంలో ముఖ్యాంశాలు

మోదీ ప్రభుత్వం ఉంది, ఎవరూ తప్పించుకోలేరు... ప్రతీ ఒక్కరి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు భారత్ ఉగ్రవాదంపై పోరాడుతోంది... దేశమే కాదు యావత్ ప్రపంచం మనకు మద్దతుగా నిలుస్తోందన్నారు 1990ల నుంచి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని వదలమని అన్నారు.

బోడో నాయకుడు ఉపేంద్రనాథ్ బ్రహ్మ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులే కాదు, ప్రపంచం మొత్తం మన వెంట ఉందని అన్నారు. ఉగ్రవాదం ఒక దేశానికి మాత్రమే కాదు, మానవాళి మొత్తానికీ ముప్పు అని అన్నారు.