బెంగాల్ ప్రభుత్వ అవార్డును అమర్త్యసేన్ తీసుకోడు.. సేన్ కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?
బెంగాల్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం బంగాబిభూషణ్ అవార్డును నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్వీకరించడం లేదు. ప్రస్తుతం ఆయన యూరప్లో ఉన్నారు. కాబట్టి, ఈ అవార్డును ఆయన తీసుకోలేడు. ఇది వరకే ఈ విషయాన్ని నిర్వాహకులు చెప్పారని అమర్త్యసేన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కోల్కతా: నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాన్ని తీసుకోబోవడం లేదు. ఈ అవార్డు ఎంపిక గురించి తనను అధికారులు ఆశ్రయించినప్పుడే అమర్త్యసేన్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తున్నది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించే అత్యున్న పురస్కారం బంగాబిభూషణ్ అందజేస్తున్న సమయంలో తాను ఇండియాలో ఉండబోవడం లేదని అమర్త్యసేన్ అప్పుడే ప్రభుత్వ అధికారులకు తెలిపినట్టు సమాచారం.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సోమవారం ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. కాగా, ప్రస్తుతం అమర్త్యసేన్ యూరప్లో ఉన్నాడని, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం మంత్రి పార్థ చటర్జీ ఎపిసోడ్ సంచలనంగా ఉన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో స్కామ్కు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్లో మంత్రి ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టీఎంసీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులను తీసుకోవద్దని సీపీఎం లీడర్ సుజన్ చక్రబొర్తి.. కోరారు. అవార్డు పొందేవారికి ఈ విషయంపై సూచనలు ఇచ్చారు.
సీపీఎం నేత సలహా మేరకు అమర్త్యసేన్ అవార్డు తీసుకోవడం లేదా? అని ప్రశ్నించగా.. ఈ వ్యాఖ్యలతో అమర్త్యసేన్కు సంబంధం లేదని వివరించారు. తాను ఈ అవార్డును తీసుకోవడం కుదర్దని, ఆ సమయంలో భారత్లో ఉండబోనని అమర్త్యసేనర్ ఈ పరిణామాలేవీ ముందుకు రాక మునుపే నిర్వాహకులకు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అమర్త్యసేన్ కృషి, అదృష్టంతో ఎన్నో అవార్డులను ఆయన పొందారని వివరించారు. అందుకే బంగాబిభూషణ్ అవార్డును ఇతర అర్హులైన వారికి ఇవ్వాలని కోరుకున్నట్టు తెలిపారు.