విద్యార్థులందరూ సమానమేనన్న ప్రభుత్వం...

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మదర్సాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లీం విద్యార్థులకు మాత్రమై ప్రవేశం కల్పించే మదర్సాలలో ఇక నుంచి విద్యార్థులంతా యూనిఫాం ధరించి రావాలని ఆదేశించారు. ఇందుకోసం మదర్సా ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నిర్ణయం పై యూపి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మోహ్సిన్ రజా మాట్లాడుతూ...అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా ఏకరూప దుస్తులను ధరించడం వల్ల విద్యార్థుల్లో అసమానతలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి మెరుగైన అభిప్రాయాలు ఏర్పడతాయని ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల కు పూర్తి భిన్నంగా ఉన్న మదర్సాలను వాటి మాదిరిగా తయారుచేసే ప్రయత్నంలో భాగంగానే దీన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. యూనిఫాంను కూడా ప్రభుత్వమై విద్యార్థులకు ఉచితంగా అందిస్తుందని మంత్రి వెల్లడించారు.

యోగి సర్కార్ ఏర్పడినప్పటి నుండి మదర్సాలలో కీలక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. మదర్సాలలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌ రీసెర్చ్‌ ఆండ్ ట్రైనింగ్‌ (ఎన్‌సీఆర్‌టీ) సిలబస్‌ను ప్రవేశపెట్టాలని, తప్పనిసరిగా ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనిఫాం కోడ్ పాటించాలని యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.